నోటుకు ఓటు కేసు: హైకోర్టుకెక్కిన టిడిపి విద్యార్థి నేత
హైదరాబాద్: తనకు ఏ విధమైన సంబంధం లేకున్నా నోటుకు ఓటు కేసుపై దర్యాప్తు చేస్తున్న తెలంగాణ ఎసిబి అధికారులు విచారణ పేరిట తనను సాక్షిగా తరుచూ పిలుస్తూ, మానసికంగా వేధిస్తున్నారని ఫిర్యాదు చేస్తూ తెలుగుదేశం పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం తెలుగునాడు విద్యార్థి సంఘ నేత వి. ప్రదీప్ చౌదరి హైకోర్టును ఆశ్రయించారు.
శుక్రవారంనాడు ఆయన అత్యవసరంగా లంచ్ మోషన్లో పిటిషన్ దాఖలు చేశారు. విచారణ పేరుతో తనను పదేపదే ఎసిబి అధికారులు పిలువకుండా, వేధించకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన కోరారు. న్యాయమూర్తి జస్టిస్ ఎ.వి. శేషసాయి ఈ వ్యాజ్యాన్ని విచారించారు. ఈ అంశంపై పూర్తి వివరాలు తెలుసుకుని కోర్టు ముందుంచాలని ఎసిబి తరఫు న్యాయవాది వి. రవి కిరణ్ రావును న్యాయమూర్తి ఆదేశించారు.
తనపై ఏ విధమైన కేసు లేకున్నా, నోటుకు ఓటు కేసుతో తనకు సంబంధం లేకున్నా తనను తరుచు పిలుస్తూ విచారణ పేరిట ఎసిబి అధికారులు వేధిస్తున్నారని ప్రదీప్ చౌదరి ఫిర్యాదు చేశారు. కొన్ని విషయాలు తెలుసుకోవడానికి మాత్రమే ప్రదీప్ చౌదరిని పిలుస్తున్నట్లు ఎసిబి తరఫు న్యాయవాది కోర్టుకు చెప్పారు.
కేసు విచారణను న్యాయమూర్తి ఈ నెల 18వ తేదీకి వాయిదా వేశారు. ప్రదీఫ్ చౌదరిని ఎందుకు విచారణకు పిలుస్తున్నారనే వివరాలను సమర్పించాలని హైకోర్టు ఎసిబిని ఆదేశించింది.
ఇదిలావుంటే, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాం అధికార పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ శాసనసభ్యుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీ సమావేశాలకు హాజరవుతున్నారని, ఆయన నియామకంపై హైకోర్టును ఆశ్రయిస్తానని ఆయన చెప్పారు. ఓటుకు నోటు కేసులో శుక్రవారం కోర్టుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు.