ఓటుకు నోటు: వాహనాలిచ్చేయండి, రేవంత్కు ఫోన్లు.. రైతు అమాయకుడే
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్కు రూ.50 లక్షలు ఇస్తూ పట్టుబడిన కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్ వాహనాన్ని తిరిగి ఆయనకు ఇచ్చేయాలని ప్రత్యేక కోర్టు బుధవారం ఎసిబిని ఆదేశించింది.
ఇందుకు సెబాస్టియన్ రూ.2 లక్షలు పూచీకత్తు సమర్పించాలని కోర్టు షరతు విధించింది. అదేవిధంగా అరెస్టు సమయంలో వారి నుంచి స్వాధీనం చేసుకున్న కేసుతో సంబంధం లేని ఇతర డాక్యుమెంట్లు తిరిగివ్వాలని ఆదేశించింది.
ఉదయ్ సిన్హా నుంచి స్వాధీనం చేసుకున్న కారు అతడిది కాకపోవడంతో కారు యజమానిని హాజరుపరచాలని కోర్టు ఆదేశించింది. దర్యాఫ్తు పూర్తయి, ఛార్జీషీటు దాఖలు చేసినందున తమ వాహనాలను ఇప్పించాలని నిందితులు పిటిషన్లు పెట్టుకున్నారు.
రాములు అమాయకుడు: ఎసిబి
ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జల్లా రైతు రాములు అమాయకుడని ఎసిబి తేల్చింది. ఓటుకు నోటు కేసులో కరీంనగర్ జిల్లా రైతు రాములుకు ఎసిబి ఇటీవల నోటీసు ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన రైతు. అయితే, ఇప్పుడు వాచ్మన్గా ఉంటున్నాడు.
ఓటుకు నోటు కేసులో తమ ఎదుట హాజరు కావాలని ఎసిబి అదికారులు సిరిసిల్లకు చెందిన రాములుకు నోటీసులు జారీ చేయగా ఆయన బుధవారం ఎసిబి కార్యాలయానికి వచ్చారు.
రాములు చిరునామాతో ఉన్న ఫోన్ నెంబర్ నుంచి రేవంత్ రెడ్డికి ఫోన్లు వెళ్లాయని, ఇందుకు గల కారణాలను నివృత్తి చేసుకునేందుకు రాములును పిలిచారు. అయితే, తన ఫోన్ చాలాకాలం క్రితమే పోయిందని రాములు చెప్పాడు. ఆయనను విచారించిన ఎసిబి రాములు ఫోన్ పోయిన మాట వాస్తవమేనని, ఆయనకు ఈ కేసుతో సంబంధం లేదని తేల్చారు.