జిమ్మీకి షెల్టర్ మీరేనా?: ఎసిబి, రేవంత్ అరెస్ట్ తర్వాత 10రోజుల కాల్డేటాతో..
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎసిబి టిడిపి యువనేతలు ప్రదీప్ చౌదరి, పుల్లారావు తదితరులను సోమవారం ప్రశ్నించింది. జిమ్మీకి ఆతిథ్యం ఇచ్చింది మీరేనా? అని ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది.
జిమ్మిబాబుతో పరిచయం వాస్తవమేనని, ఆయనకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా వస్తున్న ఆరోపణలు మాత్రం అవాస్తవమని చెప్పారని తెలుస్తోంది. వీరు వివరాలు, కుటుంబ వివరాలు, టీడీపీలో పరిచయాలు, మాజీ ఎంపీతో పుల్లారావుకు ఉన్న సాన్నిహిత్యంపై వివరాలను ఏసీబీ అధికారులు రికార్డు చేశారని తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి అరెస్టయిన పది రోజుల వరకు కాల్డేటాలో ఉన్న టీడీపీ నేతల నెంబర్లతో లింక్లు ఏమిటి? మాజీ ఎంపీకి వీరికి జరిగిన సంభాషణలేమిటి? ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో ఉన్న వీరి కాల్డేటా వివరాలపై సుమారు 60 ప్రశ్నలు సంధించి కీలక సమాచారం రాబట్టారని తెలుస్తోంది.
కాగా, తెలుగు యువత నాయకుల మీద ఏసీబీ సోమవారం ప్రశ్నల వర్షం కురిపించారు. వివిధ నాయకులతో వారికి ఉన్న సంబంధాలు, రేవంత్ రెడ్డి కేసులో పట్టుబడిన అనంతరం వారితో జరిపిన సంభాషణల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ఏసీబీ నోటీసులు అందుకున్న ఐదుగురు తెలుగు యువత నాయకులు, రేవంత్ కారు డ్రైవర్ సోమవారం ఉదయం పది గంటలకు బంజారాహిల్స్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. నోటీసులతో దర్యాప్తు అధికారి, అదనపు ఎస్పీ మల్లారెడ్డిని కలిశారు.
ఉదయం 11.00ల తర్వాత దర్యాప్తు అధికారులు వీరిని వేర్వేరు గదుల్లో విచారించారు. రేవంత్ రెడ్డి కారు డ్రైవర్ రాఘవేంద్ర రెడ్డి మినహా మిగతా నలుగురిని ఫోన్ సంభాషణలు, కాల్డేటా ఆధారంగానే విచారించినట్టుగా తెలుస్తోంది.
ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం ఐదున్నర వరకు విచారించారు. విచారణ పూర్తి కాకపోవడంతో తిరిగి మంగళవారం రావాలంటూ ఏసీబీ అధికారులు సూచించారు.
కాగా, విచారణ పూర్తి అయిన తర్వాత ఏసీబీ కార్యాలయం నుంచి బయటకు వచ్చిన ప్రదీప్, పుల్లారావు యాదవ్ మీడియాతో మాట్లాడారు. తమను ఎందుకు పిలిచారో తెలియడం లేదన్నారు. ఏసీబీ అధికారులకు కూడా తెలిసినట్టు కనిపించడం లేదన్నారు. ఫోన్ కాల్స్ ఆధారంగా పిలిచి ఉంటారని పుల్లారావ్ యాదవ్ తెలిపారు.