నోటుకు ఓటులో డ్రైవర్కు నోటీస్: నారా లోకేష్కు చిక్కులు తప్పవా?
హైదరాబాద్: నోటుకు ఓటు కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్కు చిక్కులు తప్పేట్లు లేవనే మాట వినిపిస్తోంది. ఈ కేసులో స్టీఫెన్సన్కు ఇచ్చేందుకు రేవంత్రెడ్డి తెచ్చిన యాభై లక్షల రూపాయలు చంద్రబాబు కుమారుడు లోకేశ్ వద్ద డ్రైవర్గా పని చేసే కానిస్టేబుల్ కొండల్ రెడ్డి ద్వారా వచ్చినట్లు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఎసిబి) అధికారులు ధ్రువీకరించుకున్నట్లు వార్తలు వచ్చాయి.
కొండల్రెడ్డిని విచారిస్తే లోకేష్ పాత్రపై ఆధారాలు బయటికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అందువల్లనే కొండల్ రెడ్డికి ఎసిబి అధికారులు విచారణ నిమిత్తం నోటీసు ఇచ్చినట్లు చెబుతున్నారు. తగిన ఆధారాలు లభిస్తే నారా లోకేష్కు కూడా ఎసిబి అధికారులు నోటీసులు జారీ చేస్తారని అంటున్నారు.
ఓటుకు నోటు కేసులో తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్కు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే రేవంత్రెడ్డి ఇచ్చిన డబ్బులెక్కడివి? ఎవరి నుంచి వచ్చాయి? ఎవరి ఖాతాల నుంచి డ్రా చేశారు? అనే కీలక అంశాలు తేల్చే పనిలో భాగంగా లోకేష్ వద్ద డ్రైవర్గా పని చేస్తున్న కానిస్టేబుల్ కొండల్రెడ్డిపై దృష్టి సారించినట్లు చెబుతున్నారు.
రేవంత్రెడ్డికి 50 లక్షల నగదు కొండల్రెడ్డి అందించినట్లు గుర్తించామని, అందుకే ఆయనను విచారించేందుకు సిద్ధమయ్యామని ఏసీబీలోని కీలక అధికారి ఒకరు తెలిపినట్లు బుధవారం మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం పదిన్నరకల్లా తమ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ యూసఫ్గూడలోని కొండల్రెడ్డి ఇంటికి ఏసీబీ దర్యాప్తు అధికారులు సీఆర్పీసీ సెక్షన్ 160 కింద నోటీసులు అతికించారు. కొండల్రెడ్డిని విచారిస్తే లోకేష్ పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు స్పష్టంచేస్తున్నారు.
కాగా, లోకేష్ కూడా ఓటుకు నోటు కేసులో పాత్రధారుడేనన్న అనుమానాలు ఏసీబీ వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయంటూ వార్తలు వచ్చాయి. రేవంత్రెడ్డి గన్మెన్లతో కొండల్రెడ్డి ఎందుకు మాట్లాడాడు? లోకేష్ను రేవంత్ ఎప్పుడెప్పుడు కలిశాడు? కలిసిన సమయంలో మాట్లాడిన అంశాలేంటి? లోకేష్ ఎప్పుడైనా కుట్ర సమయంలో రేవంత్తో మాట్లాడాడా? మాట్లాడితే కుట్రలో లోకేశ్ పాత్ర ఏంటి? అన్న అంశాలపై ఏసీబీ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది.