హైదరాబాద్ ఐకియా వెజ్ బిర్యానీలో బల్లి, క్షమాపణలు చెప్పిన మేనేజ్మెంట్
Recommended Video
హైదరాబాద్: నగరంలోని ఐకియా రెస్టారెంటులో సరఫరా చేసిన భోజనంలో బల్లి వచ్చింది. దీంతో జీహెచ్ఎంసీ మెడికల్ విభాగం అధికారులు నిర్వాహకులకు జరిమానా విధించారు. రెస్టారెంట్ సరఫరా చేసిన భోజనంలో బల్లి వచ్చిందని కొంతమంది వినియోగదారులు జీహెచ్ఎంసికి ఫిర్యాదు చేశారు.
ఫుడ్ కంట్రోలర్ సుదర్శన్ రెడ్డి నమూనాలను సేకరించారు. ల్యాబ్కు పంపించారు. బల్లిపడింది వాస్తమేనని ల్యాబ్లో తేలడంతో నిర్వాహకులకు రూ.11,500 జరిమానా విధించారు.
కస్టమర్ ఫిర్యాదు
ఐకియా హైదరాబాదులో ఇటీవలే తన స్టోర్ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇందులో స్వీడిష్ రెస్టారెంటులో వినియోగదారులకు సరఫరా చేసిన బిర్యానీలో బల్లి వచ్చింది. ఈ సంఘటన ఆగస్ట్ 31 (శుక్రవారం) జరిగింది. దీంతో కస్టమర్లు ఫిర్యాదు చేశారు. అధికారులు బల్లి పడింది నిజమేనని తేల్చి సెప్టెంబర్ 1న జరిమానా విధించారు.
ఐకియా క్షమాపణలు
శనివారం నాడు జీహెచ్ఎంసి అధికారులు రెస్టారెంటుకు వెళ్లి శాంపిల్స్ తీసుకొని, లేబరేటరీలో పరీక్షలు నిర్వహించారు. కాగా, వెజ్ బిర్యానీలో బల్లి రావడంపై ఐకియా మేనేజ్మెంట్ క్షమాపణలు చెప్పింది. 'బల్లి వచ్చినందుకు క్షమాపణలు చెబుతున్నాం. కస్టమర్కు ఎదురైన చేదు అనుభవంపై పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నాం. దీనిపై తాము విచారణ జరుపుతున్నాం. మళ్లీ ఇలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం. ఫుడ్ క్వాలిటీ, క్వాంటిటీపై ఐకియా కఠిన నిబంధనలు పాటిస్తోంది. వినియోగదారుడి ఆరోగ్యం, భద్రతకు కట్టుబడి ఉన్నాం' అని పేర్కన్నారు.
అంగీకరించిన యాజమాన్యం
దీనిపై అధికారులు మాట్లాడుతూ... కస్టమర్ వెజ్ బిర్యానీలో బల్లి వచ్చినట్లు ఐకియా రెస్టారెంట్ మేనేజ్మెంట్ అంగీకరించిందని తెలిపారు. కాగా, ఇందుకు సంబంధించి వినియోగదారుడు ట్వీట్ కూడా చేశారు. తన వెజ్ బిర్యానీలో బల్లి వచ్చిందని తెలిపారు.
గతంలోను ఇలాగే
కాగా, గతంలో గత ఏడాది ఆగస్టులో ఓ మాల్లోని ఆహార పదార్థాలలో బొద్దింగ వచ్చింది. ప్యాకింగ్ ఫుడ్లో దీనిని గుర్తించారు. ఇందుకుగాను నాడు అధికారులు రూ.3వేల జరిమానా విధించారు.