బెంగుళూరు ఎఫెక్ట్ : హైదరాబాద్ లో ఆ ప్రసారాలు బంద్, 'సోషల్ మీడియాతో జాగ్రత్త'
బెంగుళూరు : కర్ణాటక తమిళనాడు మధ్య నెలకొన్న కావేరీ వివాదానికి ఆజ్యం పోసింది సోషల్ మీడియా పోస్టులే అన్న కారణంతో.. సోషల్ మీడియాను గుడ్డిగా ఫాలో అవద్దని ప్రకటించారు బెంగుళూరు పోలీసులు. సోషల్ మీడియా పుకార్ల వల్లే బెంగుళూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని పోలీసులు పేర్కొంటున్నారు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలుంటే 100 నంబర్ కి ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలన్నారు.
ఇందుకోసం ప్రత్యేకంగా ఓ వాట్సాప్ నంబర్ తో పాటు ట్విట్టర్ ఖాతాను కూడా ఏర్పాటు చేశారు బెంగుళూరు పోలీస్. సిటీ పోలీసుల ట్విట్టర్ అకౌంట్ @BlrCityPolice లేదా 9480801000 వాట్సాప్ నంబర్ ద్వారా సమాచారం తెలుసుకోవచ్చన్నారు. ప్రస్తుతం నగరంలోని 16 పోలీసు స్టేషన్ల పరిధిలో కర్ఫ్యూ విధించారు పోలీసులు. కావేరి జలాల పంపకానికి సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పుతో రెండు రాష్ట్రాల మధ్య ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలా ఉంటే.. పొరుగునే ఉన్న కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల పరిస్థితి రాష్ట్రంపై ప్రభావం చూపించకుండా ఉండడానికి తెలంగాణ ప్రభుత్వం అప్పుడే చర్యలు ప్రారంభించింది. ముఖ్యంగా బెంగుళూరులో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలను ప్రసారం చేయరాదని నగరంలోని అన్ని కేబుల్ టీవీ చానెల్స్, కేబుల్ నెట్ వర్క్ ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేశారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్. దీనికి సంబంధించి ఓ అడ్వయిజరీ నోట్ ను ఆయన విడుదల చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా.. బెంగుళూరు ఘటనలు చోటు చేసుకుంటుండడంతో.. వాటి ప్రభావం రాష్ట్రం మీద పడకుండా ఉండడానికి ప్రసార మాధ్యమాలల్లో ఈ మేరకు ఆంక్షలు విధిస్తున్నట్లు తెలిపారు. కేబుల్ టీవీ నెట్ వర్క్ (రెగ్యులేషన్) యాక్ట్ 1995 కింద పనిచేసే అథారైజ్డ్ అధికారికి ఈ నోటీసులు పంపించారు కమిషనర్. చట్టంలోని సెక్షన్ 16 కింద జారీ చేసిన ఈ నోటీసును ఉల్లంఘించే ప్రయత్నం చేసే సంస్థలపై కఠిన చర్యలు ఉంటాయని వెల్లడించారు.
గణేశ్ ఉత్సవాల నేపథ్యంలోనే బక్రీద్ పండుగ కూడా రావడంతో.. నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండడానికి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని కమిషనర్ పేర్కొన్నారు. కావేరీ జల వివాదం ఎఫెక్ట్ వీటిపై పడకూడదనే ఉద్దేశంతోనే ఈ ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా తెలియజేశారు.