రూ.1,394 కోట్ల యూబీఐ స్కాం: బెంగళూరులో ‘టొటెం’ కంపెనీ డైరెక్టర్లు, అరెస్ట్ చేసిన సీబీఐ
హైదరాబాద్: వందల కోట్ల రూపాయల మేరకు బ్యాంకులను మోసగించిన వ్యవహారంలో టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లను సీబీఐ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను బెంగళూరులో అరెస్టు చేసినట్టు సమాచారం.
మొత్తం 8 బ్యాంకుల కన్సార్టియంను రూ.1394 కోట్ల మేరకు టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ మోసగించింది. హైదరాబాద్ లోని యూనియన్ బ్యాంకును రూ.313.84 కోట్ల మేరకు సదరు సంస్థ మోసగించింది. ఈ మేరకు యూనియన్ బ్యాంకు ఫిర్యాదు చేయడంతో ఆ సంస్థ డైరెక్టర్లు ఇద్దరు, మరికొందరిపై సీబీఐ కేసులు నమోదు చేసింది.
ఈ నేపథ్యంలో గురువారం నుంచే టొటెం గ్రూప్ సంస్థల్లో సీబీఐ సోదాలు చేసింది. యూనియన్ బ్యాంకు ఫిర్యాదు ఆ సంస్థ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవిత అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో వారి ఆచూకీ కనుగొనే పనిలో పడింది సీబీఐ.
బెంగళూరులో ఉన్నారనే పక్కా సమచారం అందడంతో శుక్రవారం అక్కడికి వెళ్లిన సీబీఐ అధికారులు టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ డైరెక్టర్లు తొట్టెంపూడి సలలిత్, కవితలను అక్కడ అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.