ఎస్బీఐ అధికారి అక్రమాలు... కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి రూ.3.1కోట్లు... సీబీఐ కేసు నమోదు...
స్వయం సహాయక బృందాలకు(ఎస్హెచ్జీ) కేటాయించిన రూ.3.1కోట్లను అక్రమంగా కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి మళ్లించినందుకు ఎస్బీఐ మాజీ అసిస్టెంట్ మేనేజర్ పాచికలపాడు రవిశంకర్పై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ కేసు నమోదు చేసింది. 2016 నుంచి 2019 వరకు అప్పటి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని తొర్రూర్ ఎస్బీఐ బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసిన సమయంలో రవిశంకర్ ఈ అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. వరంగల్ జిల్లా ఎస్బీఐ రీజినల్ మేనేజర్ సొంటి శ్రీరామకృష్ణ ఫిర్యాదుపై సీబీఐ కేసు నమోదు చేసింది.
ఆ ఖాతాల్లో నుంచి కుటుంబ సభ్యుల ఖాతాలకు...
స్వయం సహాయక బృందాలకు కేటాయించాల్సిన ఆ డబ్బును తన కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది ప్రైవేట్ వ్యక్తుల ఖాతాల్లోకి మళ్లించినట్లు రవిశంకర్పై ఆరోపణలున్నాయి. 'స్వయం సహాయక బృందాలు,కిసాన్ క్రెడిట్ కార్డుల ఖాతాల్లో జమ చేయాల్సిన మొత్తాన్ని రవిశంకర్ తన భార్య పద్మజ,అత్తమ్మ శమంతకమణి,తండ్రి గంగన్న,సోదరి సునీత ఖాతాల్లోకి మళ్లించాడు. ఆ తర్వాత ఆ ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకున్నాడు. ఇలా ఎస్బీఐకి రూ.3.1కోట్లు నష్టం చేశాడు.' అని సీబీఐ వెల్లడించింది.
ఇలా వెలుగులోకి...
2019లొ సోనీ మహిళా పొదుపు సంఘం ఫిర్యాదుతో రవిశంకర్ అక్రమాలు బయటపడ్డాయి. తమ గ్రూపుకు చెందిన ఖాతా నుంచి రూ.5లక్షలు డెబిట్ అయినట్లు ఆ పొదుపు సంఘం మహిళలు ఎస్బీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టగా అసిస్టెంట్ మేనేజర్ రవిశంకరే ఈ పనిచేసినట్లు తేలింది. ఆ గ్రూపు నుంచి రూ.5లక్షలు తీసి సంపత్ కుమార్ అనే వ్యక్తి ఖాతాలో రూ.3లక్షలు,గట్టు రాజ్కుమార్ అనే వ్యక్తి ఖాతాలో రూ.2లక్షలు జమ చేసినట్లు గుర్తించారు. దీంతో 2020లో రవిశంకర్ తన వ్యక్తిగతంగా ఆ డబ్బును సోని మహిళా పొదుపు సంఘానికి చెల్లించాడు.
కేసులు నమోదు చేసిన సీబీఐ
సోనీ మహిళా పొదుపు సంఘం తరహాలోనే మరికొంతమంది నుంచి కూడా ఎస్బీఐ మేనేజర్కు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. వీటన్నింటిపై విచారణ చేపట్టగా రూ.3.1కోట్లు రవిశంకర్ అక్రమంగా ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్లు తేలింది. స్వయం సహాయక బృందాలకు నిధులను కేటాయించే బాధ్యతలు నిర్వర్తించిన అతను... అదే అదనుగా ఆ ఖాతాల్లోని డబ్బును మాయం చేశాడు. రవిశంకర్పై తాజాగా సీబీఐ ఐపీసీ సెక్షన్ 120 B,420,468,471 కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తోంది.