బ్యాంకులకు రూ.4,837 కోట్ల మోసం: సుధీర్ రెడ్డి, బలరామిరెడ్డిలపై సీబీఐ కేసు నమోదు
హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన మరో మౌలిక సదుపాయాల కల్పన సంస్థ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర టోకరా పెట్టింది. భారీగా రుణాలను తీసుకుని, వాటిని చెల్లించడంలో విఫలమైంది. మొన్నటికి మొన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, లోకసభ మాజీ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు చెందిన టాన్స్ట్రాయ్పై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు..హైదరాబాద్కే చెందిన ఐవీఆర్సీఎల్ కంపెనీని నిఘా పెట్టారు. కేసు నమోదు చేశారు. ఆ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ ఈ సుధీర్ రెడ్డి, మాజీ జేఎండీ బలరామిరెడ్డితో పాటు మరి కొందరి పేర్లను ఇందులో చేర్చారు.
ఒకే కుటుంబంలో నలుగురికి: బెంగళూరులో 144 సెక్షన్: నో మ్యాన్ జోన్ లిస్ట్: ఆ జిల్లా హద్దులు క్లోజ్
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐవీఆర్సీఎల్ కంపెనీ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. రుణాల పేరుతో మొత్తం 4,837 కోట్ల రూపాయల మేర బ్యాంకులను మోసగించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. ఎస్బీఐతో పాటు ఐడీబీఐ, కెనరా బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్ (యూనియన్ బ్యాంక్), కార్పొరేషన్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలను మోసగించినట్లు ధృవీకరించారు. వాటి నుంచి మొత్తం 4,837 కోట్ల రూపాయల రుణాన్ని తీసుకుని.. వాటిని చెల్లించట్లేదని అధికారులు నిర్ధారించారు.
తమ కంపెనీ పేరు మీద భారీగా రుణాలను తీసుకున్న ఐవీఆర్సీఎల్ కంపెనీ యాజమాన్యం లెటర్ ఆఫ్ క్రెడిట్ పేరుతో వాటిని ఇతర సంస్థలకు మళ్లించినట్లు గుర్తించామని సీబీఐ అధికార ప్రతినిధి ఆర్ కే గౌర్ తెలిపారు. మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు. సుధీర్ రెడ్డి, బలరామి రెడ్డిలతో పాటు మరికొందరి పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చినట్లు వివరించారు. ఉద్దేశపూరకంగా బ్యాంకుల మోసానికి పాల్పడినట్లు తమ దర్యాప్తులో తేలిందని చెప్పారు. రుణాల ఎగవేత వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఉందనే విషయంపై ఆరా తీస్తున్నామని స్పష్టం చేశారు.