పోస్టాఫీసులో నోట్ల దందా: 70లక్షల చేతుల మార్పిడి, సూపరింటెండెంట్పై కేసు
నగరంలోని పోస్టాఫీసుల్లో నోట్ల దందా సంచలనం సృష్టిస్తోంది. అక్రమంగా నోట్లు మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్: నగరంలోని పోస్టాఫీసుల్లో నోట్ల దందా సంచలనం సృష్టిస్తోంది. అక్రమంగా నోట్లు మార్పిడి చేస్తున్నారనే ఆరోపణలతో ఇటీవల సీబీఐ దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. నగరంలోని పలు పోస్టాఫీసుల ద్వారా రూ. 70లక్షల నోట్లు చేతులు మారాయని సీబీఐ గుర్తించింది.
ఈ నేపథ్యంలోనే హిమాయత్నగర్ పోస్టల్ సూపరింటెండెంట్ సుధీర్ బాబుతో సహా మరో ఇద్దరిపై సీబీఐ అధికారులు కేసులు నమోదు చేశారు. అంతేగాక, ఈ ముగ్గురిని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది.
నవంబర్ 24 వరకు నోట్ల మార్పిడి కోసం వచ్చే ప్రజలకు ఇవ్వాల్సిన కొత్త నోట్లను అక్రమంగా తమ సొంత వ్యాపారానికి వినియోగించినట్లు సీబీఐ తేల్చింది. కాగా, నగరంలోని మరికొన్ని పోస్టాఫీసు బ్రాంచిలలో కూడా సీబీఐ దాడులు జరిపింది. మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ అనంతరం అక్రమాలకు పాల్పడిన నిందితులందర్నీ కటకటాలకు పంపించే అవకాశం ఉంది.