జగన్ ఆస్తుల కేసులో అధికార దుర్వినియోగం: సబిత ఇంద్రారెడ్డి, ధర్మానకు కోర్టు సమన్లు
హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో తెలంగాణ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఏపీ మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు తోపాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడి రాజగోపాల్, డీఆర్వో సుదర్శన్ రెడ్డి, తహసిల్దార్ ఎల్లమ్మకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.
17న హాజరుకావాలంటూ..
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో భాగంగా పెన్నా సిమెంట్స్ వ్యవహారంలో సీబీఐ కోర్టు అనుబంధ ఛార్జీషీటును విచారణకు స్వీకరించింది. ఈ కేసులో విచారణలో భాగంగా జనవరి 17న నిందితులు హాజరుకావాలని సీబీఐ కోర్టు ఆదేశించింది.
అవినీతి, అధికార దుర్వినియోగం..
గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రిగా ధర్మాన ప్రసాదరావు వ్యవహరించిన విషయం తెలిసిందే. వీరితోపాటు పలువురు అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపిస్తూ సీబీఐ అనుబంధ ఛార్జీషీట్ ను దాఖలు చేసింది. ఈ ఛార్జీషీటును స్వీకరించవద్దంటూ జగన్, సహా నిందితుల తరపు న్యాయవాదులు కోర్టులో వాదించినప్పటికీ.. కోర్టు సీబీఐ వాదనలను పరిగణలోకి తీసుకుంది.
సబిత, ధర్మాన అధికార దుర్వినియోగం
తమకున్న సమాచారం ప్రకారం మొదటి ఛార్జీ షీట్ దాఖలు చేశామని, ఆ తర్వాత మరిన్ని వివరాల ఆధారంగా అనుబంధ ఛార్జీషీటు దాఖలు చేశామని స్వీకరించింది. గతంలో ప్రధానంగా అనంతపురం జిల్లాలో పిమెంట్స్కు భూముల కేటాయింపు, తాండూరు ఇతర ప్రాంతాల్లో గనుల కేటాయింపు వ్యవహారాల్లో అవకతవకలు జరిగాయని అనుబంధ ఛార్జీషీటులో సీబీపఐ పేర్కొంది. అప్పుడు గనులశాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డి, రెవెన్యూ మంత్రిగా ఉన్న ధర్మానప్రాదర రావు సహా అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.
కోర్టుకు హాజరైన జగన్
అవినీతి నిరోధక చట్టం ప్రకారం వీరంతా నేరానికి పాల్పడినట్లు సీబీఐ తమ అనుబంధ చార్జీషీటులో పేర్కొంది. కాగా, రెండేళ్ల క్రితమే ఈ ఛార్జీషీట్ దాఖలు చేసినప్పటికీ హైకోర్టు స్టే విధించడంతో విచారణ నిలిచిపోయింది. తాజాగా, ఉన్నత కోర్టు స్టే తొలగించడంతో దానిపై మళ్లీ శుక్రవారం విచారణకు స్వీకరించింది. కాగా, అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరైన విషయం తెలిసిందే.