ట్విస్ట్: విజయరామారావు కొడుకు కేసులో సుజనాపై సంచలన ఆరోపణలు
హైదరాబాద్: కేంద్ర మంత్రి సుజనా చౌదరి కొత్త చిక్కుల్లో చిక్కుకున్నారు. సీబీఐ మాజీ డైరెక్టర్, మాజీ మంత్రి విజయరామారావు కుమారుడు కళ్యాణ్ శ్రీనివాస్ వివిధ బ్యాంకులనుంచి రు.304 కోట్ల మేర రుణాలు తీసుకుని ఎగ్గొట్టాడని సీబీఐ నమోదు చేసిన కేసు మంగళావరం సుజనా పేరు రావడంతో కొత్త మలుపు తిరిగింది.
మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నా సోదరుడు కళ్యాణ్ శ్రీనివాస్... సుజనా చౌదరికి చెందిన సుజనా గ్రూప్లో గతంలో పనిచేశారని, వారు కుట్రచేసి తమ సోదరుడిని ఈ కేసులో ఇరికించారని విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ మంగళవారం ఆరోపించారు. తన సోదరుడికి అన్ని వందల కోట్లు రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.
Also Read: సిబిఐ మాజీ డైరెక్టర్ విజయరామారావు కొడుకుపై కేసు, 304కోట్ల ఎగవేత
తన తండ్రి పార్టీ మారారన్న కక్షతోనే ఈ కేసులో నా సోదరుడిని ఇరికించారని ఆమె తెలిపారు. శ్రీనివాస్ 2012లో సుజనా గ్రూప్లో పనిచేస్తున్నప్పుడే రూ. 304 కోట్ల రుణాన్ని తీసుకున్నది ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. తప్పుడు పత్రాలను పెట్టి రుణాలు తీసుకున్నాడన్న ఆరోపణల్లో నిజంలేదని అన్నారు.
కళ్యాణ్ శ్రీనివాస్ త్వరలో ఆ డబ్బు తన ఎకౌంట్ నుంచి ఎక్కడకు వెళ్ళాయో మీడియా సమావేశంలో వివరిస్తారని ఆమె తెలిపారు. నిజాలు త్వరలో బయటకొస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ గురించి మీడియాలో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయామన్నారు.
సుజనా చౌదరికి చెందిన ఆ కంపెనీపై సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అక్కడ పనిచేయొద్దని నా తండ్రి విజయరామారావు శ్రీనివాస్కు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారన్నారు. ఏదో ఒకటి చేసి వారు ఈ స్కామ్లో ఇరికిస్తారని నా తండ్రి చెప్పారని ఆమె పేర్కొన్నారు.
రూ. 100 కోట్లకు రుణం తీసుకుని మోసం చేశారంటూ మారిషస్ కమర్షియల్ బ్యాంక్ అనే అంతర్జాతీయ బ్యాంక్ పెట్టిన కేసులో హైదరాబాద్ 12వ అదనపు ఛీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్ట్ తనకు సమన్లు జారీ చేసింది. ఇప్పుడు ఆయనపై ఈ ఆరోపణలు రావటం తెలుగు సంచలనం సృష్టిస్తోంది. కాగా, మారిషస్ బ్యాంక్ ఛీటింగ్ కేసుతో తనకు సంబంధం లేదని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు ఎలాంటి సమన్లు అందలేదని, ఆ బ్యాంక్ నుంచి రుణం తీసుకున్న సంస్థలో తాను డైరెక్టర్ను కూడా కానని చెప్పుకొచ్చారు. మరోవైపు ఏపీకి ప్రత్యేక హోదాపై స్పందిస్తూ, ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజ్యాంగాన్ని అవమానించినట్లేనన్నారు.
ప్రధాని మోడీకైనా సమన్లు ఇవ్చొచ్చన్నారు. విశాఖపట్నం రైల్వే జోన్ను ఈ రైల్వే బడ్జెట్లోనే ప్రకటిస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. అమరావతి ప్రాంతంలో భూకంప ప్రభావాలపై కమిటీ వేశామని, అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయాలో ఆ కమిటీ సూచిస్తుందని ఆయన చెప్పారు.