షాకింగ్: హైదరాబాద్లో భారీ స్కాం, ఎనిమిది బ్యాంకులకు కుచ్చుటోపీ పెట్టిన కంపెనీ!
వందల కోట్ల రుణాలు పొంది ఆనక బ్యాంకులకు కుచ్చుటోపీ పెడుతున్న కంపెనీల జాబితాలోకి తాజాగా హైదరాబాద్కు చెందిన కంపెనీ వచ్చి చేరింది. హైదరాబాద్కు చెందిన టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అనే కంపెనీ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ)కు రూ. 313 కోట్ల మేర ఎగనామం పెట్టింది.
ఈ మేరకు యూబీఐ ఫైనాన్స్ విభాగం ఫిర్యాదుతో కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్పై కేసు నమోదు చేసింది. టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ప్రమోటర్ తొట్టెంపూడి సలలిత్, డైరెక్టర్ తొట్టెంపూడి కవితలపై యూబీఐ ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.
తాజా నివేదికల ప్రకారం అజ్ఞాతంలోకి వెళ్లిన టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్లను సీబీఐ పట్టేసింది. హైదరాబాద్లోని టొటెం సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్లు సలలిత్, లలిత ఇళ్లల్లో గురువారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
1997లో ఏర్పాటైన కంపెనీ...
తొట్టెంపూడి సలలిత్ ఛైర్మన్ అండ్ ఎండీగా వ్యవహరిస్తున్న టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ 1997లో హర్యానాలోని గుర్గావ్లో ఏర్పాటైంది. రోడ్ల నిర్మాణం, వాటర్ వర్క్స్, బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ లాంటి పలు ప్రాజెక్టులను టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపట్టేది. అంతేకాదు, ఎల్ అండ్ టి, ఆర్ఐటిఇఎస్, ఇర్కాన్ ఇంటర్నేషనల్ వంటి పెద్ద కంపెనీలకు సబ్ కాంట్రాక్టర్గా కూడా వ్యవహరించేది.
ఎనిమిది బ్యాంకుల నుంచి రుణాలు...
కంపెనీ అవసరాల నిమిత్తం ఎనిమిది బ్యాంకుల కన్సార్టియం నుంచి టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ భారీ మొత్తంలో రుణాలు తీసుకుంది. యూబీఐ ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం బ్యాంకుల కన్సార్టియం టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఇంకా రూ. 1,394.43 కోట్లు చెల్లించాల్సివుంది. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ రుణ మొత్తాలను ఇతర బ్యాంకుల ఖాతాల్లోకి మళ్లించారు.
ఇతర బ్యాంకుల ఖాతాలకు సొమ్ము మళ్లించి...
ఆ తర్వాత ఇతర బ్యాంకుల్లో ఖాతాలు తెరిచి రుణాల ద్వారా పొందిన సొమ్మును ఆ ఖాతాల్లోకి కంపెనీ ప్రమోటర్లు మళ్లించారు. వేతనాలు, ఇతర ఖర్చుల కింద భారీగా లెక్కలు చూపుతూ సొమ్ము మళ్లించారు. ఆ తర్వాత బ్యాంకుకు రుణాలు చెల్లించకుండా చేతులెత్తేశారు. టొటెం రుణాలను 2012 జూన్ 30నే మొండి బకాయిలుగా బ్యాంకుల కన్సార్టియం ప్రకటించింది. అంతేకాదు, ఈ కంపెనీ ప్రమోటర్లు తెలివిగా కంపెనీ లావాదేవీలన్నీ కన్సార్టియంలో ఉన్న బ్యాంకుల్లో కాకుండా ఇతర బ్యాంకుల ద్వారా నిర్వహించారు.
రంగంలోకి దిగిన సీబీఐ...
టొటెం కంపెనీకి ఇచ్చిన రుణాన్ని 2012లోనే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎన్పీఏగా చేర్చింది. బ్యాంకు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ రంగంలోకి దిగింది. తమను రూ.313 కోట్ల మేర మోసం చేశారని యూబీఐ అధికారులు ఇచ్చిన ఫిర్యాదుతో సీబీఐ కేసు నమోదు చేసింది. తాజా నివేదికల ప్రకారం అజ్ఞాతంలోకి వెళ్లిన టొటెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీ ప్రమోటర్లను సీబీఐ పట్టుకున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్లోని టొటెం సంస్థ కార్యాలయంతో పాటు డైరెక్టర్లు సలలిత్, లలిత ఇళ్లల్లో గురువారం ఉదయం నుంచి సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.