బిడ్డ హత్య కేసులో ఇప్పటికే జైల్లో: చిదంబరాన్ని ఇరికించిన ఇంద్రాణి
Recommended Video
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఇంద్రాణి ముఖార్జియా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరాన్ని కూడా ఇరికించారు. ఈ కేసులో ఇప్పటికే చిదంబరం కుమారుు కార్తి చిదంబరాన్ని సిబిఐ అధికారులు అరెస్టు చేశారు.
ఇంద్రాణి ముఖార్జియా వాంగ్మూలం మేరకే కార్తి చిదంబరాన్ని అరెస్టు చేసినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు చెబుతున్నారు. తన కుమారుడు కార్తికి వ్యాపారంలో సాయం చేయాలని కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు చిదంబరం తనను, తన భర్త పీటర్ ముఖార్జియాను కోరారని ఆమె చెప్పారు.
ఇంద్రాణి వాంగ్మూలం రికార్డు
కూతురు షీనా బోరా హత్య కేసులో ఇప్పటికే జైలులో ఉన్న ఇంద్రాణి ముఖార్జియా వాంగ్మూలాన్ని సిబిఐ అధికారులు ఐఎన్ఎక్స్ మీడియా కేసులో రికార్డు చేశారు. ఐఎన్ఎక్స్ మీడియాకు అనుకూలంగా ఎఫ్ఐపిబి అప్రూవల్ కోసం కార్తికి, ముఖార్జియాలకు మధ్య మిలియన్ అమెరికా డాలర్ల ఒప్పందం జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి.
అరెస్టుపై నోరు విప్పని చిదంబరం
తన కుమారుడి అరెస్టుపై చిదంబరం బుధవారంనాడు ఏమీ మాట్లాడలేదు. అయితే, కాంగ్రెసు పార్టీ మాత్రం ఆయనకు రక్షణగా రంగంలోకి దిగింది. చిదంబరాన్ని వేధించే ఉద్దేశంతోనే కార్తిని అరెస్టు చేశారని కాంగ్రెసు సీనియర్ నేత కపిల్ సిబల్ విమర్శించారు. ఇది పూర్తిగా వేధింపుల రాజకీయమని ఆయన అన్నారు.
కార్తిపై సాక్ష్యాలు లభించాయి
సోదాల్లో కార్తిపై తగిన సాక్ష్యాధారాలు లభించాయని సిబిఐ, ఈడి అధికారులు అంటున్నారు. ఐఎన్ఎక్స్ మీడియా కార్తి కంపెనీలకు చెల్లింపులు జరిపిన వోచర్లు లభించినట్లు చెబుతున్నారు. ఆ వోచర్లపై పీటర్ ముఖార్జియా సంతకాలు ఉన్నాయని అంటున్నారు.
చిదంబరాన్ని ఆఫీసులో కలిశాం
ఐఎన్ఎక్స్ మీడియాలో ఎఫ్డఐకి ఎప్ఐపిబి అప్రూవల్ కోసం తాము చిదంబరాన్ని ఆయన నార్త్ బ్లాక్ ఆఫీసులో కలిశామని ఇంద్రాణి, పీటర్ ముఖార్జియాలు తమ వాంగ్మూలాల్లో చెప్పారు. తన కుమారుడికి వ్యాపారంలో సాయం చేయాలని, అందుకు విదేశీ చెల్లింపులు జరపాలని చిదంబరం కోరినట్లు ముఖార్జియాలు చెప్పినట్లు దర్యాప్తు అదికారులు చెబుతున్నారు.
చెల్లింపుల కోసం ఆ సంస్థలు
కార్తి చిదంబరాన్ని తాము ఢిల్లీలోని హోటల్ హయత్లో కలిశామని, అక్కడే మిలియన్ డాలర్ల లంచం ఇచ్చామని, చెల్లింపుల కోసం ప్రత్యామ్నాయంగా చెస్ మేనేజ్మెంట్, అడ్వాంటేజ్ స్ట్రాటజిక్ పేర్లు కార్తి చెప్పారని ముఖార్జియాలు సూచించినట్లు ముఖార్జియాలు వెల్లడించినట్లు దర్యాప్తు సంస్థలు అంటున్నాయి. ఆ సంస్థలకు చెల్లింపులు జరిపిన ఆధారాలు కూడా లభించాయని దర్యాప్తు సంస్థ అధికారులు చెప్పారు.