సీబీఐ డైరెక్టర్గా వరంగల్ వ్యక్తి, అవార్డులు.. పదవులు.. ప్రత్యేకతలెన్నో: ఎవరీ నాగేశ్వరరావు?
వరంగల్/న్యూఢిల్లీ: సీబీఐలో వివాదం నేపథ్యంలో మంగళవారం రాత్రికి రాత్రి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్గా తెలుగు వ్యక్తి మన్నెం నాగేశ్వర రావును నియమించారు. విజయరామారావు అనంతరం తెలుగు వ్యక్తికి దక్కిన అరుదైన అవకాశం ఇది. నాగేశ్వర రావు సీబీఐ జాయింట్ డైరెక్టర్గా పని చేశారు. ఇప్పుడు తాత్కాలిక చీఫ్.
సీబీఐలో ఫైట్: రాగానే తెలుగు అధికారి నాగేశ్వరరావు పవర్, సొంత కార్యాలయంలో సోదాలు
1986 బ్యాచ్కు చెందిన ఒడిశా క్యాడర్ అధికారి. గతంలో ఆయన ఒడిశా డీజీపీగా పని చేశారు. ఆయనది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మంగపేట మండలం బోరునర్సాపురం గ్రామం. ఆయన అంచెలంచెలుగా ఎదిగి ఈ స్థాయికి వచ్చారు. నాగేశ్వర రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ అయిన విషయం తెలిసి ఆయన గురించి తెలిసిన వారు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
వ్యవసాయ కుటుంబం నుంచి చదువు వరకు
నాగేశ్వర రావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు. తండ్రి పిచ్చయ్య. తల్లి శేషమ్మ. నాగేశ్వర రావుకు ఒక అక్క, చెల్లి, తమ్ముడు ఉన్నారు. మంగపేట ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివారు. తిమ్మంపేటలో పదో తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఏవీవీ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. సీకేఎం కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. ఓయు నుంచి కెమెస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1986లో ఇండియన్ పోలీస్ సర్వీస్లో చేరక ముందు మద్రాస్ ఐఐటీలో రీసెర్చ్ వర్క్ చేశారు.
Recommended Video
ఓయూలో పీజీ చేస్తుండగా ఉద్యోగం
ఉస్మానియా యూనివర్సిటీలో పీజీ చేస్తున్న సమయంలో ఆయన సివిల్స్ రాశారు. 1986లో ఐపీఎస్గా ఎంపికయ్యారు. ఒడిశా కేడర్ అధికారిగా పని చేశారు. కానీ ఎక్కువ కాలం చత్తీస్గఢ్లో విధులు నిర్వర్తించారు. గతంలో సౌత్ రాష్ట్రాలకు జేడీగా లక్ష్మీనారాయణ వ్యవహరించారు. ఆయన తర్వాత ఆ స్థానంలో నాగేశ్వర రావు నియమితులయ్యారు. ఆ తర్వాత 7 ఏప్రిల్ 2016లో జాయింట్ డైరెక్టర్, ఇప్పుడు తాత్కాలిక డైరెక్టర్ అయ్యారు.
ఓడిశాలో కీలక పదవులు
నాగేశ్వర రావు ఒడిశా డీజీపీగా పని చేశారు. అంతకుముందు మయూర్భంజ్, నబరంగపూర్, బార్గార్, జగత్సింగాపూర్ తదితర జిల్లాలకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పని చేశారు. రూర్కేలా, కటక్ రైల్వేస్లో ఎస్పీగా పని చేశారు. క్రైమ్ బ్రాంచ్ ఎస్పీగా పని చేశారు. నేర విచారణలో ఒడిశాలో డీఎన్ఏ ఫింగర్ ఫ్రింట్స్ ఉపయోగించిన విలక్షణ తొలి అధికారి ఇతనే. 1996లో జగత్సింగాపూర్ ఎస్పీగా ఉన్న సమయంలో ఓ అత్యాచారం కేసులో దీనిని ఉపయోగించారు.
పలు అవార్డులు, మెడల్స్
ఒడిశా ఫైర్ సర్వీస్ చీఫ్గా నాగేశ్వర రావు పని చేశారు. 2013లో ఫైలిన్, 2014లో హుధుద్ తుఫాన్లు వచ్చినప్పుడు అతని సేవలను గుర్తించిన ప్రభుత్వం అవార్డులు కూడా ఇచ్చింది. అతను ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ కూడా దక్కించుకున్నారు. ఒడిశా గవర్నర్ నుంచి కూడా మెడల్ పొందారు. నాగేశ్వర రావు సీబీఐలో 2016లో చేరారు.