వడ్డీ లేని రుణాలిస్తామంటూ రూ. లక్షలు కాజేశారు: ఢిల్లీ ముఠా అరెస్ట్
హైదరాబాద్: భారీ మొత్తంలో రుణాలను వడ్డీ లేకుండానే ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను సైబర్ క్రైం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా సభ్యులైన ఢిల్లీకి చెందిన విశాల్ సింగ్(30), హరిశంకర్ సింగ్(28), రాంలాల్ సింగ్(30)లను అక్కడ్నుంచి ట్రాన్సిట్ వారెంట్తో సోమవారం హైదరాబాద్ తీసుకొచ్చారు.
ఈ ముఠా నుంచి రూ.9.10లక్షల నగదు, 2 సెల్ ఫోన్లు, పదుల సంఖ్యలో ఏటీఎం కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు వివరాలను డీసీపీ(క్రైం) అవినాశ్ మహంతి వెల్లడించారు. ఢిల్లీకి చెందిన విశాల్సిగ్, హరిశంకర్సింగ్, రామ్లాల్ సింగ్లు స్నేహితులు. వీరు ఏడాది క్రితం ఎక్సైడ్, హెచ్డీఎఫ్సీ జీవితబీమా పాలసీ ఏజెంట్లుగా పనిచేసి మానేశారు.
అనంతరం తాము ఉద్యోగుల్లా కాకుండా పొరుగుసేవల పద్ధతుల్లో పనిచేస్తామని.. ఓ బీమా పాలసీకి కమీషన్ ఇవ్వాలంటూ ఒప్పందం కుదుర్చుకున్నారు. ముగ్గురు కలిసి న్యూఢిల్లీలోని రాజోరిగార్డెన్స్ సమీపంలోని ఒక ఫ్లాట్లో ఇండియా ఇన్ఫోలైన్ పేరుతో 9నెలల క్రితం కంపెనీ ప్రారంభించారు. మెట్రోనగరాలు, పట్టణాల్లో వివిధ సెల్ఫోన్ నెట్వర్క్లకు చెందిన ఫోన్నంబర్లను సేకరించారు.
బీమా పాలసీలు చేయించడంతో పాటు అక్రమంగా డబ్బు సంపాదించేందుకు ప్రణాళికను రచించారు. ఈమేరకు విశాల్సింగ్ గత మే నెలలో మారుపేరుతో ఫోన్ చేయడంతో న్యూమల్లేపల్లి వాసి మీర్అహ్మద్అలీ స్పందించాడు. పాలసీ కట్టిన అనంతరం రూ.10లక్షలు రుణం కావాలని కోరాడు. దీంతో మీకు ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ రూ.40లక్షలు రుణం ఇచ్చేందుకు అంగీకరించిందని విశాల్సింగ్ నమ్మించాడు.
ఇందుకు రుసుం రూ.99వేలు పంపితే చెక్కు పంపిస్తామని నమ్మబలికాడు. దీంతో మీర్ అహ్మద్ రూ.99వేలు చెక్కుద్వారా పంపించాడు. వారంరోజులకే హరిశంకర్సింగ్ ఫోన్ చేసి ఆదాయపు పన్ను కోసం రూ.1.15లక్షలు ఇవ్వాలని దీన్ని మాక్స్ సర్వీసెస్ పేరుపై పంపించాలని సూచించగా... మీర్ అహ్మద్ ఆ మొత్తాన్ని కూడా పంపించాడు. ఆ తర్వాత నిందితులు ఫోన్ చేయడం మానేశారు.
ఈ క్రమంలో మోసపోయానని తెలుసుకున్న అహ్మద్.. సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు జరిపి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి విచారణలో మరిన్ని మోసాలు బయటపడే అవకాశం ఉంది.