షాక్: బోజగుట్టలో 78 ఎకరాలు దీపక్ రెడ్డితో సహ ఆరుగురిపై రిజిస్ట్రేషన్
హైద్రాబాద్ లోని బోజగుట్ట భూముల అన్యాక్రాంతంపై పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు. పలు సర్వే నెంబర్లలో ఉన్న 900 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించినట్టుగా పోలీసులు నిర్ధారించారు.
హైదరాబాద్: హైద్రాబాద్ లోని బోజగుట్ట భూముల అన్యాక్రాంతంపై పోలీసులు సాక్ష్యాధారాలను సేకరించారు. పలు సర్వే నెంబర్లలో ఉన్న 900 ఎకరాల భూమిని కబ్జాకు యత్నించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో కీలక సూత్రధారి శైలేష్ సక్సేనా, అతని అనుచరుడు శ్రీనివాసరావుగా గుర్తించారు పోలీసులు.
హైద్రాబాద్ లోని పలు ప్రాంతాల్లో భూముల కబ్జాకు పాల్పడినట్టుగా ఆరోపణలతో ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన టిడిపి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డితో పాటు ఆయన న్యాయవాది శైలేష్ సక్సేనాతో పాటు మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.
అయితే అసలు ఏ ప్రాంతంలో ఎంత భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించారనే విషయమై పోలీసులు ఆరాతీస్తున్నారు.తప్పుడు పత్రాలను సృష్టించి భూములను ఆక్రమించడమే ఈ ముఠా పనిగా పెట్టుకొందని పోలీసులు చెబుతున్నారు.
తీగలాగితే డొంకంతా కదిలినట్టుగా ఈ ముఠా నగరంలోని ఇంకా ఏయే ప్రాంతాల్లో ఈ రకంగా భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిందనే విషయాలపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
బోజగుట్టలో 900 ఎకరాల కబ్జాకు ప్రయత్నం
బోజగుట్టలో 900 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించినట్టుగా సిసిఎస్ పోలీసులు నిర్దారించారు. ఈ కేసులో దీపక్ రెడ్డి న్యాయవాది శైలేష్ సక్సేనా, అతని అనుచరుడు శ్రీనివాసరావులను నిందితులుగా గుర్తించారు పోలీసులు. అయితే ఈ కేసులో జ్యూడిషియల్ రిమాండ్ లో ఉన్న శైలేష్ సక్సేనా తో పాటు ఎమ్మెల్సీ దీపక్ రెడ్డిని తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారిని విచారిస్తే మరిన్ని వివరాలు దొరికే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
పదేళ్ళ నుండి బెదిరింపులు
పదేళ్ళ నుండి ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ఆయన న్యాయవాది శైలేష్ సక్సేనా చేసిన అక్రమాలపై మరింత సమాచారాన్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. తప్పుడు పత్రాలను సృష్టిస్తూ , స్థలం హక్కుదారులను బెదిరస్తున్నారని బాధితుల నుండి వాంగ్మూలాలను సేకరించారు. కీలకమైన ఆధారాలను సేకరించి కేసును నీరుగారిపోకుండా పోలీసులు ప్రయత్నాలను చేస్తున్నారు.ఈ మేరకు బాధితుల నుండి సమాచారాన్ని సేకరించారు.
వివాదాస్పద భూములను గుర్తిస్తారిలా
ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి డ్రైవర్ తిరుపతిరెడ్డి, శైలేష్ సక్సేనా అనుచరుడు శ్రీనివాసరావులు వివాదాస్పద భూములను గుర్తించి సక్సేనాకు సమాచారమిస్తారు.ఆయన తప్పుడు పత్రాలు సృష్టించేవారని పోలీసులు గుర్తించారు.అయితే తప్పుడు పత్రాలను సృష్టించేందుకుగాను లేని మనుషులను తెరపైకి తీసుకొస్తారు.ఆ భూములను తమ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేసుకొనేందుకు సులువైన మార్గాలను గుర్తించి వాటిని అమలు చేస్తారు.
అక్రమంగా రిజిస్ట్రేషన్లు
కోర్టుల్లో కేసులు వేసి ఈ భూములు తమవేనంటూ అధికారికంగా ఉత్తర్వులు సంపాదించుకొని అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయించుకొన్నారని పోలీసులు గుర్తించారు. వీరిపై ఇప్పటికే సిసిఎస్ లో నాలుగు కేసులున్నాయని డిసిపి జోగయ్య తెలిపారు.సర్వే నెంబర్ 294 నుండి 299 వరకు రూ.400 కోట్ల విలువైన 78.22 ఎకరాల భూమిని సక్సేనా తప్పుడు పత్రాలు సృష్టిస్తే దీపక్ రెడ్డి సహా మరో ఆరుగురి పేరున 2008 లో ఈ భూములు రిజిస్ట్రేషన్ జరిగినట్టు పోలీసులు గుర్తించారు.