ఇద్దరితో విడాకులు, ఆటో డ్రైవర్తో లింక్: భార్యకు చెప్తానని బెదిరింపు, చంపేశాడు
గల్ఫ్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన మహిళ మృతి కేసు మిస్టరీ వీడింది. సిసిటీవీ ఫుటేజీ సహకారంతో సైబరాబాద్ పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. నజియా బేగం అనే ఆ మహిళ హత్య కేసులో పోలీసులు ఓ ఆటో డ్రైవర్ను
హైదరాబాద్: గల్ఫ్ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చిన మహిళ మృతి కేసు మిస్టరీ వీడింది. సిసిటీవీ ఫుటేజీ సహకారంతో సైబరాబాద్ పోలీసులు కేసు మిస్టరీని ఛేదించారు. నజియా బేగం అనే ఆ మహిళ హత్య కేసులో పోలీసులు ఓ ఆటో డ్రైవర్ను అరెస్టు చేశారు.
ఆమెను మిత్రుడు షేక్ సలీం హత్య చేసినట్లు పోలీసులు ధృవీకరించారు. మధ్య ప్రాచ్యానికి రెండోసారి వెళ్లడానికి డబ్బులు డిమాండ్ చేయడంతో అతను ఆ ఘాతుకుని ఒడిగట్టినట్లు తేలింది.
సలీం నజియా బేగంను హత్య చేసి ఆమె శవాన్ని హైదరాబాదు శివారులోని రాజేంద్రనగర్ వద్ద మూసీనదిలో పడేశాడు. హత్యకు గల కారణాన్ని శంషాబాద్ డిసిపి పివి పద్మజ వెల్లడించారు.
అది వరకు రెండు పెళ్లిళ్లు...
సికింద్రాబాదులోని బోయిన్పల్లికి చెందిన నజియా బేగం 2005లో మొహమ్మద్ మహబూబ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. అతని ద్వారా ఆమెకు ఓ కుమారుడు కలిగాడు. విభేదాలతో అతనితో విడిపోయింది. ఆ తర్వాత 2011లో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. రెండో భర్త వల్ల ఆమెకు కూతురు పుట్టింది.
వేధింపులు భరించలేక...
రెండో భర్త వేధింపులను తట్టుకోలేక నజియా బేగం 2015లో మధ్యప్రాచ్యానికి వెళ్లి ఇళ్లలో పని మనిషిగా చేరింది. ఆ తర్వాత 2017లో హైదరాబాద్ తిరిగి వచ్చింది. గల్ఫ్ వెళ్లడానికి ముందు ఆమె కారు డ్రైవర్ షేక్ సలీంతో స్నేహం చేసింది. తిరిగి గల్ఫ్కు వెళ్లడానికి తనకు 70 వేల రూపాయలు ఇవ్వాలని నజియా సలీంను డిమాండ్ చేసింది.
తిరస్కరించడంతో...
డబ్బులు ఇవ్వడానికి సలీం తిరస్కరించడంతో బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభించింది. తమ మధ్య ఉన్న సంబంధాన్ని సలీం భార్యకు చెప్తానని బెదిరించింది. దీంతో నజియాను చంపాలని సలీం నిర్ణయించుకున్నాడు. ఆగస్టు 31వ తేదీన బోయిన్పల్లిలోని కలింగ ఎంక్లేవ్లో ఉన్న ఆమెను తీసుకుని మేడ్చెల్ అయోధ్య నగర్ అటవీ ప్రాంతానికి వెళ్లాడు.
అక్కడే హత్య..
అయోధ్య నగర్ అటవీ ప్రాంతంలో సలీం నజియాపై కత్తితో దాడి చేశాడు. ఆమె చాతీలో, కడుపులో కత్తితో పొడిచాడు. దాంతో ఆమె మరణించింది. శవాన్ని మూసీనదిలో పడేశాడు. నజియా తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు సాగించారు. సిసిటీవీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు నజియా సలీంతో వెళ్లినట్లు గుర్తించారు. దాంతో సలీంను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరాన్ని అంగీకరించాడు.
సలీం ఇలా చేశాడు....
సలీం 2017 ఆగస్టు 31వ తేదీ ఉదయం టిఫిన్ చేసిన తర్వాత డాగర్ను తన అన్న కారు మారుతీ స్విఫ్ట్ డిజైర్(టీఎస్ 10 యూఏ 3365)లో పెట్టుకున్నాడు. బేగంపేటలో ఓ కస్టమర్ను కారులో ఎక్కించుకొని కూకట్పల్లిలో దించాడు. వచ్చిన డబ్బుతో మూసాపేట పెట్రోల్ బంకులో డీజిల్ కొట్టించుకున్నాడు. అదేరోజు సాయంత్రం 4 గంటలకు నజియా బేగం తన పిల్లల స్కాలర్షిప్ కోసం ఆధార్ కార్డు, స్కూల్ రిపోర్ట్ జిరాక్స్కాపీలు తీసుకోవాలని అనుకుంది. ఆమెను సలీం కారులో బోయిన్పల్లిలోని కళింగ ఎన్క్లేవ్ వద్ద ఎక్కించుకొనిమేడ్చల్ గండి మైసమ్మ ప్రాంతానికి తీసుకెళ్లాడు.
ఎక్కడికని అడిగింది...
నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళుతుండగా ఎక్కడికని నజియా సలీంను అడిగింది. ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో గొడవ జరిగింది. భయపడిన నజియా బేగం నిర్మానుష్య ప్రాంతం నుంచి రోడ్డువైపు పరుగు తీయడం ప్రారంభించింది. సలీం డాగర్తో ఆమె తల వెనుక భాగంలో కొట్టాడు. నజియా బేగం అల్లా అంటూ కింద పడిపోయింది. ఆమె ఛాతి, కడుపులో పొడిచి చంపేశాడు. తనవెంట తీసుకెళ్లిన ప్లాస్టిక్ కవర్లో మృతదేహాన్ని ఉంచి, డాగర్ను అత్తాపూర్ వద్ద మూసీ నదిలో పడేసి వెళ్లిపోయాడు.
మిస్సింగ్ కేసుగా నమోదు
కుమార్తె నజియా బేగం కనిపించడంలేదంటూ ఆమె తండ్రి మహ్మద్ అన్వర్ సెప్టెంబర్ 6వ తేదీన బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసి ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అత్తాపూర్ మూసీ నది వద్ద మృతదేహం ఉందనే సమాచారంతో రాజేంద్రనగర్ పోలీసులు ఆచూకీ కోసం అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారం ఇచ్చారు. బోయిన్పల్లి ఎస్ఐ రఘువీర్రెడ్డి, కానిస్టేబుల్ మహ్మద్ షకీల్తోపాటు నజియా బేగం కుటుంబసభ్యులు అత్తాపూర్ చేరుకున్నారు. మృతదేహం చేతికి ఉన్న కడియాన్ని బట్టి నజియా బేగంగా గుర్తించారు. తన కూతురు మరణానికి షేక్ సలీం కారణమని తండ్రి మహ్మద్ అన్వర్ పోలీసులకు చెప్పాడు. అతడిని అరెస్టు చేసి కారు, డాగర్, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.