భద్రాద్రి సీతారామస్వామి బ్రహ్మోత్సవ సంరంభం .. అంకురార్పణతో నేటి నుండి ప్రారంభం
తెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామస్వామి కొలువైన భద్రాద్రి క్షేత్రం. భద్రాద్రి శ్రీ సీతారామ స్వామి వారి వార్షిక కళ్యాణ బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఏప్రిల్ 10వ తేదీ అంటే నేటి నుండి అంకురార్పణతో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. లోకకళ్యాణార్థం నిర్వహించే భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని ఏప్రిల్ 14 వ తేదీన నిర్వహించడానికి ముహూర్తం ఖరారైంది. శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే కళ్యాణోత్సవం ఆద్యంతం కన్నుల పండుగగా సాగుతుంది. పావన క్షేత్రమైన భద్రాచల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఏప్రిల్ 6 నుండి 20వ తేదీ వరకు శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు నిర్వహించేందుకుఏర్పాట్లు చేశారు భద్రాద్రి దేవాదాయ శాఖ అధికారులు.
కాంతులీనుతున్నభద్రాద్రి ... నేడు అంకురార్పణతో బ్రహ్మోత్సవాల ఆరంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు.ఏప్రిల్ 10వ తేదీన అంటే నేడు బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం నిర్వహిస్తున్నారు . ఏప్రిల్ 9వ తేదీ దేవతాహ్వానం పలికిన అర్చకులు స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా జరపటానికి సిద్ధంగా ఉన్నారు.
బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా ..
శ్రీ సీతా రాముల వారి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా భద్రాచలంలోని స్వామి వారి దేవస్థానం లో బుధవారం నుండి నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఉత్సవ అంకురార్పణతో ఈ కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ రోజున ప్రత్యేక తీర్థ బిందెను గోదావరి నుంచి తీసుకొచ్చే అంకురార్పణ చేస్తారు. 11న ధ్వజ పట మండల లేఖనం చేస్తారు. 12న ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. 13న ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా జరుగుతుంది. 14న శ్రీ సీతారామ స్వామి వారి కళ్యాణం మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపంలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఇక 15వ తేదీన శ్రీరామ మహా పట్టాభిషేకాన్ని దేవస్థానం ఆధ్వర్యంలో సాంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించనున్నారు. గవర్నర్ నరసింహన్ దంపతులు స్వామి వారి కల్యాణ బ్రహ్మోత్సవాలలో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. స్వామివారి కల్యాణ బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట్ర దేవాదాయశాఖ కమిషనర్ అనిల్ కుమార్ స్వయంగా పరిశీలించారు.