యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవ సంరంభం .. అంకురార్పణతో నేటి నుండి ప్రారంభం
తెలంగాణకే తలమానికమైన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కొలువైన యాదాద్రి క్షేత్రం. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. మార్చి 08వ తేదీ నుండి మార్చి 18వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. మొత్తం 11 రోజుల పాటు జరిగే ఉత్సవాలకు ఆలయ నిర్వాహకులు, అధికారులు ఏర్పాట్లు చేశారు.
8 నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు.. 11 రోజుల పాటు వేడుకలు
కాంతులీనుతున్న యాదాద్రి ... నేడు అంకురార్పణతో బ్రహ్మోత్సవాల ఆరంభం
బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. మార్చి 08వ తేదీన అంటే నేడు బ్రహ్మోత్సవాలకు అంకుర్పారణ చేసి, స్వస్తివాచనం, రక్షా బంధనం నిర్వహిస్తున్నారు . మార్చి 9వ తేదీ దేవతాహ్వానం పలుకుతారు. సుమారు 40 మంది రుత్విక్కులకు ఆహ్వానాలు పంపారు. ఆలయంలో హోమగుండం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా యాగశాల నిర్మాణం చేశారు. వేసవి కాలం కావడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చలువ పందిళ్ళు వేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. హై స్కూల్ మైదానంలో స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది.
బ్రహ్మోత్సవాల నిర్వహణ ఇలా ..
ఇక స్వామివారి బ్రహ్మోత్సవాల్లో బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి ఈ నెల 10వ తేదీ నుండి 16వ తేదీ వరకు వారం రోజుల పాటు అలంకార, వాహన సేవలు నిర్వహిస్తారు.మార్చి 10వ తేదీ ఉదయం మత్స్యావతారం అలంకార సేవ, రాత్రి 9గంటలకు శేష వాహనసేవ ఉంటుంది.మార్చి 11న ఉదయం 11గంటలకు శ్రీ కృష్ణాలంకార సేవ, రాత్రి 9గంటలకు హంస వాహనసేవ జరుగనుంది.మార్చి 12వ తేదీ ఉదయం 11గంటలకు వటపత్రశాయి అలంకార సేవ, రాత్రి 9గంటలకు పోన్న వాహన సేవ నిర్వహిస్తారు. మార్చి 13న ఉదయం 11గంటలకు గోవర్ధనగిరిధారి అలంకార సేవ, రాత్రి సింహ వాహన సేవ ఉంటుంది. మార్చి 14న ఉదయం 11 గంటలకు జగన్మోహిని అలంకార సేవ, రాత్రి 9గంటలకు అశ్వవాహన సేవ, రాత్రి 9 గంటలకు స్వామి వారి కళ్యాణం నిర్వహిస్తారు. మార్చి 16వ తేదీ ఉదయం 11గంటలకు శ్రీ మహావిష్ణు అలంకార సేవ, రాత్రి స్వామి వారి దివ్యవిమాన రథోత్సవం ఉంటుంది. ఓం నమో లక్ష్మీనరసింహాయ అంటూ భక్తుల జయజయధ్వానాలతో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాల నిర్వహణ జరగనుంది.