కన్నుల పండువగా సీతారాముల కల్యాణం
ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు. మిధిలా ప్రాంగణం వేదికగా సుందర, సుమధురు దృశ్యకావ్యం ఆవిష్కృతమైంది. పావన గోదావరి తీరాన కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం జరిగింది. నుదిటిన కల్యాణ తిలకం, బుగ్గన దిష్టిచుక్కతో సీతమ్మ సిగ్గుల మొగ్గ కాగా.. సర్వాభరణ భూషితుడైన రామయ్య పెళ్లి మండంపంలో ఆసీనులయ్యారు. వేద మంత్రోచ్చారణలు, భక్తుల జయ జయ ధ్వానాల మధ్య జగదభిరాముడు సీతమ్మవారి మెడలో మాంగళ్యధారణ చేశాడు.
సీతారాముల కల్యాణం చూతమురారండి!
తొలుత ధ్రువమూర్తుల కల్యాణం
భద్రాద్రిలో తొలుత ధ్రువమూర్తుల కల్యాణం అనంతరం కల్యాణమూర్తుల అలకారం జరిగింది. బాజా భజంత్రీలు, వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణమూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. జానకీదేవిని శ్రీరాముని ఎదుట కూర్చోబెట్టి రక్షా బంధనం, మోక్ష బంధనం అనంతరం 24 అంగుళాల పొడవున్న 12 దర్బలతో అల్లిన దర్బతాడును సీతమ్మ నడుముకు కట్టారు. వధూవరులిద్దరికీ రక్షా సూత్రాలు కట్టి స్వామివారి గృహస్థాశ్రమ సిద్ధి కోసం సువర్ణ యజ్ఞోపవీతాన్ని ధరింపజేశారు.
అభిజిత్ లగ్నంలో జిలకర బెల్లం
కన్యావరణం అనంతరం స్వామివారికి పాద ప్రక్షాళన చేసి పరిమళ భరిత తీర్థంతో మంత్రోక్తంగా పుష్పోదక స్నానం చేయించారు. గోదానం చేసి మహా సంకల్పం పఠించి వరపూజ నిర్వహించారు. అనంతరం జగత్ కల్యాణార్థం సాక్షాత్ విష్ణు స్వరూపుడైన శ్రీరామచంద్రుడికి శ్రీ మహాలక్ష్మి రూపైన సీతమ్మను కన్యాదానం చేశారు. అభిజిత్ లగ్నం సమీపించగానే మంగళవాయిద్యాలు మారుమోగుతుండగా.. సీతారాముల జిలకరబెల్లం క్రతువు పూర్తి చేశారు. ఆ తర్వాత తొమ్మిది పోగులతో మూడు సూత్రాలతో మంగళసూత్రాన్ని రూపొందించి సీతమ్మ మెడలో రామయ్యతో మూడు ముళ్లు వేయించారు.
గోటితో ఒలిచిన తలంబ్రాలు
భద్రాద్రి రాముడికి ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మాంగళ్యధారణ అనంతరం జరిగిన తలంబ్రాల ఘట్టం నయనానందకరంగా సాగింది. ముత్యాలతో పాటు గోటితో ఒలిచిన తలంబ్రాలతో ఈ తంతు నిర్వహించారు. అనంతరం దాంపత్య బంధానికి ప్రతీకగా జానకీరాములకు బ్రహ్మ బంధనం (బ్రహ్మముడి) వేసిన అర్చకులు నవ వధూవరులతో బంతి ఆట ఆడించారు. కర్పూర నీరాజనం సమర్పించి ఆశీర్వచనంతో కల్యాణ క్రతువు పూర్తి చేశారు.
భారీగా తరలివచ్చిన భక్తులు
సీతారాముల కల్యాణాన్ని వీక్షించేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాక వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కోదండరాముని వివాహం కనులారా చూసి తరించిపోయారు. అధికారుల ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తంచేశారు.