తెలంగాణలో తగ్గనున్న సెల్ఫోన్ల ధరలు: ఎందుకంటే..?
తెలంగాణ రాష్ట్రంలో ఇక సెల్ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో బుధవారం వ్యాట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఇక సెల్ఫోన్ల ధరలు తగ్గనున్నాయి. ఎందుకంటే తెలంగాణ శాసనసభ సమావేశాల్లో బుధవారం వ్యాట్ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపారు. సభలో బుధవారం ఉదయం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.
అనంతరం ఈ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ... నోట్ల రద్దు నేపథ్యంలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించడం కోసం సెల్ఫోన్లపై వ్యాట్ తగ్గింపు బిల్లును తీసుకొచ్చామని తెలిపారు. దీంతో మొబైల్ ఫోన్లపై 14.5 శాతం ఉన్న వ్యాట్ 5 శాతానికి తగ్గిందని చెప్పారు.
డిజిటలైజేషన్ అందరికీ సౌకర్యవంతంగా ఉండాలని తమ సర్కారు కృషి చేస్తోందని ఆయన చెప్పారు. కాగా, వ్యాట్ తగ్గింపును బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ సభ్యులు స్వాగతించారు. వ్యాట్ సవరణ బిల్లు ఆమోదంతో తెలంగాణలో సెల్ ఫోన్ల ధరలు స్వల్పంగా తగ్గనున్నాయి.
బీసీ కమిషన్ సవరణ బిల్లుకు ఆమోదం
అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం బీసీ కమిషన్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. సభలో మంత్రి జోగు రామన్న బిల్లును ప్రవేశపెట్టారు. దీనిపై సభ్యులు ప్రసంగించారు. బీసీలకు అన్యాయం జరుగకుండా బీసీ కమిషన్ పనితీరు ఉండాలని సభ్యులు కోరారు. దీనిపై మంత్రి జోగు రామన్న స్పందిస్తూ .. కసరత్తు అంతా చేశాకే కమిషనన్ను నియమించామని తెలిపారు.
అన్ని అంశాలను పరిశీలన చేశామని పేర్కొన్నారు. చేతి వృత్తుల వారిని, కుల వృత్తులవారిని, కిందివారిని పరిగణలోకి తీసుకున్నామని వివరించారు. తొలగించిన 26 కులాల గురించి విద్యా వెనుకబాటు తనాన్ని పరిశీలించి కమిషన్ నివేదిక ఇస్తుందని వివరించారు. పార్టీల కతీతంగా 54 శాతం ఉన్న బీసీ జనాభాకు న్యాయం జరగాలని కమిషన్ వేశామన్నారు. చర్చ తర్వాత సభ సవరణ బిల్లును ఆమోదించింది.