గోల్కొండ, చార్మినార్ సందర్శనకు కేంద్రం ఓకే... ఆన్ లైన్ బుకింగ్స్- ఎప్పటినుంచో తెలుసా ?
కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా పర్యాటక స్ధలాలకు సందర్శకులే కరువయ్యారు. దీంతో అవి గతంలో ఎన్నడూ లేనంత దారుణంగా వెలవెలబోతున్నాయి. తాజాగా లాక్ డౌన్ మార్గదర్శకాల్లో చేసిన మార్పులతో కేంద్ర పురావస్తుశాఖ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఉన్న పర్యాటక స్ధలాల సందర్శనను పునరుద్ధరించాలని నిర్ణయించింది. లాక్ డౌన్ కారణంగా రోజూ పర్యాటకశాఖకు సందర్శకుల ద్వారా వచ్చే కోట్లాది రూపాయల ఆదాయానికి గండిపడటంతో పురావస్తుశాఖ తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ ను ఖాళీ చేయిస్తున్న కరోనా .. రద్దీ లేని రోడ్లు.. భయం గుప్పిట్లో హైదరాబాదీలు
కేంద్ర పురావస్తుశాఖ తాజా నిర్ణయం ప్రకారం హైదరాబాద్ లోని ప్రముఖ పర్యాటక కట్టడాలైన గోల్కొండ కోట, చార్మినార్ సందర్శనను కూడా పర్యాటకుల కోసం పునరుద్ధరిస్తన్నారు. జూలై 6 నుంచి ఆన్ లైన్ టికెట్ బుకింగ్స్ తో వీటి సందర్శనను పునరుద్ధరించాలని అధికారులు నిర్ణయించారు. కేంద్రం తాజా నిర్ణయంతో పురావస్తుశాఖ హైదరాబాద్ సర్కిల్ అధికారులు వీటి సందర్శనలో పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఇందులో చార్మినార్, గోల్కొండ కోటకు రోజుకు 2 వేల మందిని చొప్పున మాత్రమే అనుమతించనున్నారు.
కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఇకపై గోల్కొండ, చార్మినార్ సందర్శించాలనుకునే వారు ఆన్ లైన్ లో టికెట్లు తీసుకోవడంతో పాటు కోవిడ్ 19కు సంబంధించిన అన్ని జాగ్రత్తలను పాటించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మాస్కులు ధరించడంతో పాటు భౌతిక దూరం, ఇతరత్రా నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. వీటి అమలును స్దానికంగా ఉండే అధికారులకే అప్పగించారు. సోమవారం నుంచి ఆన్ లైన్ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని ఫురావస్తుశాఖ అధికారులు ప్రకటించారు.