నీటి గొడవ: తెలంగాణ ఫిర్యాదుపై ఏపి స్పందించాలన్న కేంద్రం
న్యూఢిల్లీ/హైదరాబాద్: నీటి కేటాయింపుల్లో తమకు అన్యాయం జరిగిందంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై కేంద్రం స్పందించింది. తమకు జరిగిన అన్యాయాన్ని సవరించడానికి కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని లేదా కృష్ణా జలవివాద ట్రిబ్యునల్-2కు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం చేసిన ఫిర్యాదుపై అభిప్రాయాన్ని తెలపాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది.
ఈ మేరకు కేంద్ర జలవనరుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అమర్జిత్ సింగ్ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకు లేఖ రాశారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, దీన్ని సవరించి న్యాయం చేయడానికి కొత్త ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని లేదా ఉన్న ట్రిబ్యునల్కే దీనిని అప్పగించాలని 2014 జులై 14న తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్యకార్యదర్శి కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శికి లేఖ రాశారు.
అంతర్రాష్ట్ర జల వివాద చట్టంలోని సెక్షన్3 ప్రకారం కృష్ణా జలవివాదానికి సంబంధించి ఈ ఫిర్యాదు చేశారు. దీని ప్రకారం ఫిర్యాదు చేసిన ఏడాదిలోగా కేంద్రం జోక్యం చేసుకొని భాగస్వామ్య రాష్ట్రాల మధ్య ఓ అంగీకారానికి ప్రయత్నించాలి లేదా కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి. ఏడాదిలోగా కేంద్రం స్పందించకపోతే దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశం ఉందని పేర్కొంది.
ఈ ఏడాది జులై 14తో ఆ గడువు ముగుస్తున్నందున తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లేందుకూ కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే కేంద్రం స్పందించింది. తెలంగాణ ఫిర్యాదుపై వీలైనంత త్వరగా అభిప్రాయం తెలపాలని ఏపీని కోరింది. అక్కడి నుంచి సమాధానం వెళ్లిన తర్వాత కేంద్రం తదుపరి చర్యకు సిద్ధం కానుంది.
బచావత్, బ్రిజేష్కుమార్ ట్రిబ్యునళ్లు రెండింటిలోనూ తెలంగాణకు అన్యాయం జరిగిందని, మొత్తం కృష్ణా జలాలపై మళ్లీ విచారణ జరపాలని తెలంగాణ కోరింది. ఈ ట్రిబ్యూనళ్ల ముందు కృష్ణా నదీ జలాలపై తన వాదనను వినిపించే అవకాశం తెలంగాణకు రాలేదని తన ఫిర్యాదులో పేర్కొంది.
బేసిన్ పరిధిలో లభించే నీటిలోనూ, ఎగువ రాష్ట్రాల నుంచి వచ్చే నీటిని పక్క బేసిన్లకు తరలించడం వల్ల నీటి పంపిణీలో రాష్ట్రాల మధ్య అసమానతలు చోటుచేసుకొన్నాయని వివరించింది. ఈ నేపధ్యంలో నీటి వినియోగం, పంపిణీ, నీటిపై హక్కు ఇలా అన్ని అంశాలపై కృష్ణా నదీ బేసిన్లోని రాష్ట్రాల మధ్య పునఃపరిశీలన చేయాలని కోరింది.
ఆరు దశాబ్దాలుగా కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, తమ ప్రయోజనాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పట్టించుకోలేదనీ పేర్కొంది. కృష్ణా జలాలపై ఫిర్యాదులో మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లు భాగస్వాములని తెలంగాణ తన లేఖలో స్పష్టంగా చెప్పింది. కాగా, అభిప్రాయం తెలపాలంటూ ఆంధ్రప్రదేశ్కు మాత్రమే కేంద్రం లేఖ రాసింది. కృష్ణా బేసిన్లో భాగస్వామ్య రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్రల ప్రస్తావన దీనిలో లేకపోవడం గమనార్హం.