పింక్ ఔట్..! కేంద్ర ఎన్నికల సంఘం తాజా నిర్ణయం.. కాంగ్రెస్ కు కలిసొచ్చేనా..!
ఎన్నికల వేళ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్న తాజా నిర్ణయం కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇస్తుందా..! తమ పార్టీకి కలిసొచ్చే అంశంగా భావిస్తోందా? ఇలాంటి ప్రశ్నలకు అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మహిళా ఓటర్ల కోసం ఏర్పాటు చేసే పోలింగ్ కేంద్రాలకు నిర్ధిష్టమైన రంగు ఉండకూడదని ఆదేశించింది సెంట్రల్ ఈసీ.
ఒక రంగు వాడినట్లయితే అది రాజకీయ పార్టీలకు సంబంధించిన కలర్స్ కు సమీపంగా ఉండకూడదనేది కేంద్ర ఎన్నికల సంఘం సారాంశం. అందుకే రంగుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని.. అలాంటి అనుమానాలకు తావివ్వకుండా చూడాలని స్టేట్ ఎలక్షన్ కమిషన్ కు సూచించింది. ఈమేరకు లేఖ పంపింది. మహిళా ఓటర్ల కోసం గులాబీ రంగులో ఏర్పాటు చేసే స్పెషల్ పోలింగ్ సెంటర్లపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ ఫిర్యాదు నేపథ్యంలో సెంట్రల్ ఈసీ ఇలాంటి నిర్ణయం వెలువరించడం చర్చానీయాంశంగా మారింది.
ఆ రంగు వద్దు..!
ఎన్నికల సందర్భంగా మహిళా ఓటర్ల కోసం ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. పింక్ బూత్, సఖి బూత్ అనే పేర్లతో పిలిచే వీటికి సాధారణంగా పింక్ కలర్ తో రంగులు వేస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కలర్ పింక్ కావడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ సెంట్రల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. పింక్ కలర్ కారణంగా ఆ పార్టీకి ఓట్లు పడే ఛాన్సుందనేది కాంగ్రెస్ నేతల ఆరోపణ.
అదలావుంటే ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు అస్కారం ఇవ్వొద్దనే ఉద్దేశ్యంతో సెంట్రల్ ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్. మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో వివరాలు వెల్లడించారు. ఎన్నికల వేళ బూత్ లలో విధులు నిర్వర్తించేవారి డ్రెస్ కోడ్ పై ఎలాంటి ఆంక్షలు లేవని తెలిపారు. కేవలం మహిళా ఓటర్ల పోలింగ్ కేంద్రాల రంగుకు సంబంధించి మాత్రమే సెంట్రల్ ఈసీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.
పింక్.. మహిళల కార్యక్రమాలకు ఇదే రంగు
మహిళలకు సంబంధించిన కార్యక్రమాలకు సంబంధించి జనరల్ గా పింక్ కలర్ యూజ్ చేస్తుంటారు. క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ పింక్ రన్ లో అదే రంగు వాడతారు. అలా మహిళా ఓటర్లకు సంబంధించి పోలింగ్ కేంద్రాలకు పింక్ రంగు వినియోగిస్తున్నారు. అయితే టీఆర్ఎస్ పార్టీ రంగు అదే కావడంతో తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుంది. రాజకీయ పార్టీలకు సంబంధించిన కలర్స్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని స్టేట్ ఈసీకి ఆదేశాలిచ్చింది.
పింక్ ఔట్.. కాంగ్రెస్ కు కలిసొచ్చేనా?
ఇప్పటి ఎన్నికల్లో టీఆర్ఎస్ తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్ధమైన కాంగ్రెస్ నేతలు అందివచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నేతలను ఇరకాటంలోకి నెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. తాజాగా మహిళా ఓటర్ల ప్రత్యేక పోలింగ్ కేంద్రాలకు పింక్ రంగు వినియోగించొద్దంటూ ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో రంగుల వాడకం విషయంలో సెంట్రల్ ఈసీ వెలువరించిన నిర్ణయం తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు.
మహిళా పోలింగ్ కేంద్రాలకు పింక్ రంగు వాడినట్లయితే దాని ప్రభావం ఓటర్ల మీద ఉంటుందనేది కాంగ్రెస్ నేతల అభిప్రాయం. పింక్ కలర్ కారణంగా మహిళా ఓటర్లు టీఆర్ఎస్ కు ఓట్లు వేసే ఛాన్సుందనేది వారి వాదన. అందుకే పింక్ రంగు విషయంపై ఫిర్యాదు చేశారు. ఈనేపథ్యంలో సెంట్రల్ ఈసీ ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.
అందివచ్చే అవకాశాలపై కాంగ్రెస్ చూపు..!
టీఆర్ఎస్ పై గతంలో హైకోర్టులో వేసిన పిటిషన్లపై సానుకూలమైన తీర్పులు రావడం ఈ ఎన్నికల్లో కలిసొస్తుందని అనుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. కొన్ని అంశాల్లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మొట్టికాయలు పడటంతో పాటు.. ఇందిరా పార్క్ ధర్నాచౌక్ విషయంలో ఆరువారాల పాటు నిషేధం ఎత్తివేస్తూ ఆదేశాలివ్వడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇలా కోర్టు తీర్పులు, ప్రజా వ్యతిరేక విధానాలతో పాటు అందివచ్చే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు.