వరంగల్ ఉప ఎన్నికలు: కెసిఆర్ ప్రభుత్వానికి ఈసీ నోటీసు
హైదరాబాద్: వరంగల్ ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన విధాన నిర్ణయాల పైన రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం నోటీసులు జారీ చేసింది. ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినట్లు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఈసీకి ఫిర్యాదు చేసింది.
క్రిస్మస్ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం, ఉస్మానియా విద్యార్థుల మెస్ ఛార్జీలను రద్దు చేయటం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జీఆర్ఈ, టోఫెల్ పరీక్షలకు శిక్షణ, కళ్యాణలక్ష్మి పథకంలోకి బీసీలను చేర్చటం, వరంగల్లోని కాళోజీ నారాయణరావు వైద్య కళాశాలకు వీసీ నియామకం తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించింది.
ఎన్నికల సమయంలో ప్రభుత్వం నూతన పథకాలను ప్రకటించకూడదు. పథకాలు ప్రకటిస్తే ఓటర్లు ప్రభావితం అయ్యే అవకాశముంటుంది. దీంతో, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈసీ... క్షేత్రస్థాయి, రాష్ట్ర అధికారుల నుంచి నివేదికను తెప్పించుకుంది.
నివేదికలను పరిశీలించిన రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్లాల్.. కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. దీనిని అధ్యయనం చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు జారీ చేసింది. సంబంధిత ప్రకటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా తెలంగాణప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మను కోరింది.
ప్రభుత్వం వివరణ
ఎన్నికల నియమావళిని ఉల్లంఘిస్తున్నారన్న విపక్షాల ఫిర్యాదులను ప్రభుత్వం తోసిపుచ్చింది. కొత్తగా ఎలాంటి పథకాలను చేపట్టలేదని, నిర్ణయాలు తీసుకోలేదని కేంద్ర ఎన్నికల సంఘానికి బుధవారం లేఖ రాసింది. దేని పైనా తాజాగా ఉత్తర్వులు ఇవ్వలేదని పేర్కొంది.
సీఎం, మంత్రులు ఎక్కడా కొత్త నిర్ణయాలను ప్రకటించలేదని, కార్యక్రమాలను చేపట్టలేదని, ఎలాంటి ఆదేశాలు, ఉత్తర్వులు ఇవ్వలేదని లేఖలో తెలిపారు. ఉద్యోగ నియామకాలు, కళ్యాణలక్ష్మి బీసీలకు వర్తింపు, ఉపకారవేతనాల విడుదల వంటివి ప్రభుత్వ విధానాలలో భాగంగా గతంలో ప్రకటించినవేనని పేర్కొన్నారు.
వరంగల్ లోకసభ పరిధిలో గురువారం సాయంత్రం ఐదు గంటలకు ప్రచారం ముగుస్తుందని ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ చెప్పారు. ఈ నేపథ్యంలో అప్పటికల్లా ఇక్కడ ఓటు హక్కులేని నేతలు జిల్లా విడిచి వెళ్లిపోవాలన్నారు. స్థానిక నేతలు ఇళ్ల నుంచి బయటకు రాకూడదని, ఎవరైనా బల్క్ సందేశాలు పంపినా, కోడ్ ఉల్లంఘించినా తమకు సమాచారం ఇవ్వాలన్నారు. ఈ ఎన్నిక నేపథ్యంలో ఇప్పటివరకు 9 ఫిర్యాదులు అందాయని, వివరణ ఇవ్వాలని సీఎస్ను ఆదేశించినట్టు చెప్పారు. వరంగల్ జిల్లాలో ఇప్పటివరకూ రూ.1.79 కోట్ల నగదు, 4314 లీటర్ల మద్యం సీజ్ చేశామన్నారు.