మెట్రో అధికారులపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఫైర్, ప్రారంభోత్సవానికి ఆహ్వానించకపోవడంపై గుస్సా..
హైదరాబాద్ మెట్రో అధికారులపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇటీవల ప్రారంభించిన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో సర్వీస్ ప్రారంభోత్సవానికి తమను పిలువకపోవడాన్ని తప్పుపట్టారు. మెట్రో ప్రాజెక్టులో కేంద్రం వాటా కూడా ఉందని.. అలాంటప్పుడు తమను అధికారులు ఎలా విస్మరిస్తారని కిషన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. పార్లమెంట్ నడిచే సమయంలో ప్రారంభోత్సవాలు నిర్వహించడం సరికాదని కిషన్ రెడ్డి అభిప్రాయపడ్డారు.
కేంద్రం భాగస్వామ్యం..
జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు 11 కిలోమీటర్ల దూరంతో.. మధ్యలో 9 స్టేషన్లతో మెట్రో కారిడార్ పనులు పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టులో కేంద్రం కూడా భాగస్వామ్యంగా ఉందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గుర్తుచేశారు. కానీ అధికారులు ప్రోటోకాల్ పాటించలేదని, తమను ఆహ్వానించలేదని పేర్కొన్నారు.
కేంద్రమంత్రి సమీక్ష..
శనివారం దిల్ కుషా అతిథిగృహంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మెట్రో అధికారులతో సమీక్షిస్తారు. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ వరకు మెట్రో రైలులో ప్రయాణిస్తారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డితోపాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేత రాంచందర్ రావు కూడా పర్యటిస్తారు. జేబీఎస్ నుంచి సికింద్రాబాద్ వెస్ట్, గాంధీ ఆస్పత్రి, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్ బజార్, ఎంజీబీఎస్ స్టేషన్లను పరిశీలిస్తారు.
ఆహ్వానించని ప్రభుత్వం
ఈ నెల 7వ తేదీన జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలును సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో దేశంలో రెండో అతిపెద్ద మెట్రో కారిడార్గా ఆవిర్భవించింది. మెట్రో రైలు ప్రారంభోత్సవంలో మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ పాల్గొన్నారు. బీజేపీ నేతలను ఆహ్వానించకపోవడంతో గుస్సా మీదున్నారు.
మెట్రోలో ప్రయాణం
శనివారం మెట్రో రైలు గురించి సమీక్షించి.. మెట్రోలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రయాణించనున్నారు. మెట్రోలో కేంద్రం భాగస్వామ్యం కూడా ఉందని చెప్పేందుకే బీజేపీ నేతలు పర్యటన చేపట్టబోతున్నారని తెలుస్తోంది. రాష్ట్ర ప్రజల్లోకి మరింత ముందుకెళ్లేందుకు పర్యటన దోహదపడుతోందని బీజేపీ నేతలు భావిస్తున్నారు.