ఆరేళ్లుగా మున్సిపాలిటీకి రూపాయి కేటాయించని కేసీఆర్ సర్కార్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విమర్శలు
తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి చివరిరోజు ప్రచారంలో రాజకీయ పార్టీలు హోరెత్తాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు హామీలు గుప్పించారు. నల్గొండ జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. చౌటుప్పల్ తంగడపల్లిలో రోడ్ షో నిర్వహించారు. వేలాది మంది బైక్ ర్యాలీ నిర్వహించారు. అంతకుముందు బీజేపీ శ్రేణులకు కేంద్రమంత్రి ఘనస్వాగతం పలికారు.
ఒక్క రూపాయి ఇవ్వలేదు
ఆరేళ్లలో తెలంగాణ ప్రభుత్వం గ్రామానికే కాదు మున్సిపాలిటీకి కూడా ఒక్క రూపాయి మంజూరు చేయలేదని కిషన్ రెడ్డి విమర్శించారు. ఇదేకాదు కేంద్ర ప్రభుత్వం ఇస్తోన్న మన్ రేగా, గ్రామీణాభివృద్ధి నిధులను హరితహారానికి మళ్లించారని ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి ఓటు అడిగే నైతిక హక్కు లేదన్నారు. అధికార దుర్వినియోగం చేసి, డబ్బులు వెదజల్లి, ఎంఐఎం సహకారంతో ఎన్నికల్లో గెలవాలని చూస్తోందన్నారు.
సేవాభావం మెండు..
ఆయా చోట్ల బీజేపీ అభ్యర్థులు వారిలాగా ఖర్చు చేయకపోవచ్చు.. కానీ వారికి సేవాభావం మాత్రం మెండు అని కిషన్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ నల్గొండలో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. తమ అభ్యర్థులను గెలిపిస్తే అండర్ డ్రైనేజీ, రహదారులు, తాగునీరు, మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం కృషి చేస్తామన్నారు. తెలంగాణలో కల్వకుంట, ఎంఐఎం కుటుంబాల నుంచి విముక్తి చేస్తామని.. 2023లో బీజేపీ అధికారం చేపడుతోందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేటీఆర్కు సవాల్
రాష్ట్రానికి పదేళ్ల యూపీఏ హయాంలో విడుదలైన నిధులెన్నీ.. ఆరేళ్లలో ఎన్డీఏ హయాంలో కేటాయించిన నిధులు వివరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై చర్చకు రావాలని మంత్రి కేటీఆర్కు సవాల్ విసిరారు. తెలంగాణ ప్రభుత్వం ఒక్క డబుల్ బెడ్ రూం ఇళ్లు నిర్మించలేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరిగే మున్సిపల్ ఎన్నికలు సెమీ ఫైనల్స్ అని కిషన్ రెడ్డి అభివర్ణించారు.
ఎన్పీఆర్ తప్పనిసరి..
ఎన్ఆర్సీ ఊసేలేదని.. అయితే జనాభా లెక్కల కోసం మాత్రం ఎన్పీఆర్ చేయాల్సిందేనని చెప్పారు. తెలంగాణ సెక్రటేరియట్ బట్టల మూటలో, పైళ్లలో ఉందని.. సచివాలయం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణనేనని కిషన్ రెడ్డి విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రంతో ముగియగా.. ఈ నెల 22వ తేదీన మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 25వ తేదీన ఓట్లను లెక్కించి, ఫలితాలను ఎన్నికల అధికారులు వెల్లడిస్తారు.