కేసీఆర్ సర్కార్ పై కేంద్రం నిఘా పెట్టటం శుభ పరిణామం .. విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, స్టార్ క్యాంపెయిన్ విజయశాంతి కేసీఆర్ సర్కార్ కు వార్నింగ్ ఇస్తున్నారు. కేంద్రం కేసీఆర్ ప్రభుత్వంపై నిఘా పెట్టిందని ఆమె వ్యాఖ్యానించారు . ఐదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని, అక్రమాలు పెరిగిపోయాయని విజయశాంతి ఆరోపణలు గుప్పించారు . నిరంకుశంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ సర్కారుపై కేంద్ర ప్రభుత్వం నిఘా పెట్టడం శుభపరిణామమని తెలంగాణ పిసిసి ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసేందుకు కేంద్రం నిఘా పెట్టిందన్న విజయశాంతి
ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని కుదేలు చేస్తున్న కేసీఆర్ సర్కార్ పై కేంద్ర సర్కార్ దృష్టి పెట్టిందని , ప్రభుత్వ అవినీతిని బట్టబయలు చేసేందుకు నిఘా పెట్టిందని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ఆధారాలతోసహా కేసీఆర్ సర్కార్ చేసిన అవినీతి భాగోతాలు బయటపెట్టినా కేసీఆర్ ప్రభుత్వం మాత్రం నిరంకుశంగా వ్యవహరిస్తూ విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేసిందని విజయశాంతి ఆరోపించారు . ఈ మేరకు బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.
అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ బెదిరింపుల ఫలితమే ఈ నిఘా అన్న రాములమ్మ
ఇక తమ జోలికి ఎవరూ రాకుండా ఉండాలని అవినీతి ఆరోపణలు చేస్తే పరువు నష్టం కేసులు పెడతామని కేసీఆర్ ప్రభుత్వం బెదిరించిందని, ఈ నేపథ్యంలో కేసీఆర్ పాలనపై కేంద్రం నిఘా పెట్టిందని విజయశాంతి అన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోని అవకతవకలపై సమాచారం సేకరిస్తుందని బీజేపీ నేతలు ప్రకటించడాన్ని రాష్ట్ర ప్రజలు మంచి పరిణామంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.
టీఆర్ఎస్ అవినీతిపై చర్యలు తీసుకోవాలన్న విజయశాంతి
కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసినా అడిగే నాథుడు లేడన్న బరితెగింపుతో వ్యవహరిస్తోందని , కేసీఆర్ ను కట్టడి చేసే రోజు కోసం ప్రజానీకం ఎదురుచూస్తోందని అన్నారు. ఇక అది త్వరలోనే వస్తుందని ఆమె పేర్కొన్నారు. కేవలం నిఘాతో సరిపెట్టకుండా టీఆర్ఎస్ పాలనలో అవకతవకలపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇప్పుడు ఆ పని బీజేపీ చేసినా ఓకే అని అన్నారు. అప్పుడే బంగారు తెలంగాణ పేరుతో కేసీఆర్ ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని విజయశాంతి పేర్కొన్నారు.