గాంధీ ఆస్పత్రిలో కేంద్రబృందం, సిబ్బంది పనితీరు పరిశీలన, కంటైన్మెంట్ క్లస్టర్లలోనూ..
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో కోవిడ్-19 నోడల్ ఆస్పత్రి గాంధీని కేంద్రబృందం సోమవారం పరిశీలించనుంది. టీం నిన్ననే హైదరాబాద్ చేరుకోగా.. ఉదయం పరిశీలించి వైరస్ పెరుగుదల, గాంధీలో అందిస్తోన్న వైద్యంపై దృష్టిసారించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో శనివారం కరోనా వైరస్ పాజిటివ్ కేసులు వెయ్యికి పైగా నమోదు కావడంతో ఆందోళన నెలకొంది. ఈ క్రమంలోనే క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకు సెంట్రల్ టీం రంగంలోకి దిగింది.
Recommended Video
గాంధీలో పరిశీలన..
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరగడానికి గల కారణాల గురించి తెలుసుకోనున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పాజిటివ్ కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. వైరస్ సోకిన రోగులు దాదాపు అందరూ గాంధీలోనే ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అక్కడ రోగులకు అందిస్తోన్న సదుపాయలు, వైద్యులు, సిబ్బంది పనితీరును కేంద్ర బృందం పరిశీలించనుంది. అయితే కేంద్ర బృందం పర్యటన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో లోపాలు, లోటుపాట్లను సరిచేసే చర్యలను చేపట్టినట్టు తెలుస్తోంది.
కంటైన్మెంట్ క్లస్టర్ పరిశీలన
కేంద్ర బృందం ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు ఒక కంటైన్మెంట్ క్లస్టర్ పరిశీలించనున్నారు. అక్కడ జనం ఎలా ఉంటున్నారు..? సమూహ వ్యాప్తి ఉందా అనే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. తర్వాత తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం అవుతారు. అక్కడినుంచి నేరుగా గాంధీ ఆస్పత్రికి వెళతారు. అక్కడ ఆస్పత్రిని నిశీతంగా పరిశీలిస్తారు. తర్వాత టిమ్స్కి వెళతారు.
లాక్ డౌన్ అమలు..?
రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందున మరోసారి లాక్ డౌన్ విధించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్ డౌన్ మరింత కఠినంగా విధించే అవకాశం ఉంది. దీనికి సంబంధించి రెండు, మూడురోజుల్లో తెలంగాణ మంత్రివర్గం సమావేశమై నిర్ణయం తీసుకోనుంది. ప్రభుత్వ సంకేతాలను బట్టి.. వచ్చే సోమవారం నుంచి గ్రేటర్ పరిధిలో లాక్ డౌన్ అమలయ్యే అవకాశం ఉంది. మంత్రివర్గ సమావేశం తర్వాత మీడియాకు ఇదివరకటి లాగే కేసీఆర్ ప్రకటన విడుదల చేసే ఛాన్స్ ఉంది.