తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు తప్పవా - డిస్కంలకు కేంద్రం షాక్..!!
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి విద్యుత్ కోతలు తప్పవా. ప్రస్తుతం చోటు చేసుకుంటున్న పరిణామాలతో ఈ అనుమానాలు మొదలయ్యాయి. తెలుగు రాష్ట్రాలతో పాటుగా 13 రాష్ట్రాల్లో ఈ అంశమే ఇప్పుడు అక్కడి ప్రభుత్వాలకు సమస్యగా మారుతోంది. తాజాగా.. తెలంగాణ, ఏపీ సహా 13 రాష్ట్రాలు ఎక్స్ఛేంజీల్లో కరెంటు కొనకుండా కేంద్రం నిషేధం విధించింది. విద్యుదుత్పత్తి సంస్థలకు బకాయిలు చెల్లించని ఫలితంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. పవర్ ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధిస్తూ షాక్ ఇచ్చింది.
13 రాష్ట్రాలపై ఎఫెక్ఠ్
దీంతో రెండు రాష్ట్రాల డిస్కంలు ఎక్స్ఛేంజీ ద్వారా విద్యుత్ కొనుగోలు, మిగులు విద్యుత్ అమ్మకాలకు ఈ రోజు అవకాశం లేనట్లే. కేంద్రం నిషేధం విధించిన వాటిలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపుర్, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్, జమ్మూ-కశ్మీర్, బిహార్, ఝార్ఖండ్, మిజోరం, రాజస్థాన్ రాష్ట్రాల డిస్కంలు కూడా ఉన్నాయి. నిషేధం వల్ల తలెత్తే లోటు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విద్యుత్ కోతలు విధించే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం రూపొందించిన ఎల్పీఎస్ నిబంధనల్లో భాగంగా రాష్ట్రాల డిస్కంలకు సరఫరా చేసిన విద్యుత్.. చెల్లించాల్సిన బిల్లు మొత్తాలను విద్యుదుత్పత్తి సంస్థలు ఎప్పటికప్పుడు పోర్టల్లో అప్లోడ్ చేసే విధానాన్ని అమల్లోకి తెచ్చింది. అప్లోడ్ చేసిన తేదీనే ప్రామాణికంగా తీసుకుని బకాయిలున్నాయంటూ కేంద్రం చర్యలు తీసుకుంది.
తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం
ఇప్పుడు కేంద్ర తీసుకున్న తాజా నిర్ణయం పైన రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. శుక్రవారం రియల్టైం మార్కెట్లో విద్యుత్ను కొనుగోలు చేస్తామని ఏపీ ఇంధన శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. పీక్ డిమాండ్ సమయంలో రోజుకు 10-15 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం అవుతుందని చెబుతున్నారు. ఇదే సమయంలో రాష్ట్ర ట్రాన్స్కో, జెన్కో సీఎండీ ప్రభాకరరావు మెయిల్ ద్వారా విద్యుత్ ఎక్స్ఛేంజీకి లేఖ రాశారు. విద్యుత్ ఎక్స్ఛేంజీలలో కొనుగోలు, విక్రయాలకు సంబంధించి తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దంటూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని ఆ లేఖలో గుర్తుచేసారు.
వినియోగం పెరిగితే కోతలు తప్పవా..!
తెలంగాణలో గురువారం గరిష్ఠ విద్యుత్ డిమాండు 12,114 మెగావాట్లు నమోదైంది. ప్రస్తుతం కృష్ణానదిలో పెద్ద ఎత్తున వరద వస్తున్నందున తెలుగు రాష్ట్రాల్లో పూర్తిస్థాయిలో జలవిద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం గరిష్ఠ డిమాండు సమయంలో డిస్కంలు 2 వేల మెగావాట్ల దాకా ఎక్స్ఛేంజీలో కొంటున్నాయి. శుక్రవారం నుంచి నిషేధం విధించినందున ఈ మేర వ్యవసాయానికి త్రీఫేజ్ సరఫరా తగ్గించాలని డిస్కంలు యోచిస్తున్నాయి. సమస్య పరిష్కారమైతే ఎలాంటి కోతలు ఉండవని అధికారులు చెబుతున్నారు. దీంతో.. సోమవారం ఈ మొత్తం వ్యవహారం పైన ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ కోతలు తక్షణమే అవసరం లేదని చెబుతున్నా.. సమస్య పరిష్కారం కాకుంటే మాత్రం కోతలు తప్పేలా లేవని సమాచారం.