చెరువుల ఆక్రమణ, నాలాలపై నిర్మాణాలు.. ఈ తప్పు గత పాలకులదే: మంత్రి తలసాని
కేంద్రంపై మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నీతి అయోగ్ నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్రానికి నష్టం జరుగుతోన్న.. తాము సహకరిస్తున్నామని తెలిపారు. కానీ తెలంగాణ రాష్ట్రం పట్ల మోడీ సర్కార్ సానుకూలంగా లేదన్నారు. జీఎస్టీ, ఎఫ్ఆర్ బీఎంపై తీరని నష్టం జరిగిందని చెప్పారు. ఇంత జరుగుతోన్న.. వరద సాయంపై కూడా కేంద్రం ప్రకటన చేయకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఉప్పల్ చెరువు వద్ద నిలిచిన నీరు.. పరిశీలించిన మంత్రి తలసాని శ్రీనివాస్, మేయర్
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్ అంతా తిరిగారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కానీ వరద బాధితుల కోసం రూపాయి కూడా విడుదల చేయలేదని పేర్కొన్నారు. బీజేపీ నేతల మాటలు కోటలు దాటుతాయని.. కానీ చేతలు మాత్రం ఉండవన్నారు. హైదరాబాద్ పరిస్థితి చూసి కేంద్ర ప్రభుత్వం స్పందించాలని తలసాని కోరారు. ప్రధాని నరేంద్ర మోడీ జోక్యం చేసుకోవాలన్నారు. తక్షణ సాయం కింద నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితికి కారణం ఎవరు అని తలసాని ప్రశ్నించారు. గత పాలకులు కాదా అని ఆయన అడిగారు. చెరువులు, నాలాలపై ఇళ్ల నిర్మాణాలు కూడా జరిగాయని తెలిపారు. అందువల్లే డ్రైనేజీ సిస్టమ్ ఇబ్బందులు అని.. దానిని సరిచేసేందుకు సమయం పడుతోందని చెప్పారు. కానీ తమ ప్రభుత్వంపై మాత్రం ఆరోపణలు చేయడం సరికాదన్నారు. తమ ప్రభుత్వాల హయాంలో జరిగిన తప్పులకు తామేలా బాధ్యులం అవుతామని అడిగారు. ఇందుకు టీడీపీ, కాంగ్రెస్.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కారణం అని ఆరోపించారు.
చినుకు పడితే చాలు హైదరాబాద్ చిత్తడవుతోంది. అలాంటిదీ అధిక వర్షపాతం నమోదవుతోంది. దీంతో పలు కాలనీలు జలదిగ్బందంలో చిక్కుకున్నాయి. గ్రౌండ్ ప్లోర్ దాదాపుగా మునగగా.. కార్లు కొట్టుకుపోతున్నాయి. కొన్ని ఏరియాలు పూర్తిగా నీటితో నిండిపోయాయి. ఇదిలాఉంటే మరో రెండు నుంచి మూడురోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొనడం.. హైదరాబాదీలను కలవరానికి గురిచేస్తోంది.