ఏపీ బెటర్! మహమ్మారి కరోనా విషయంలో ఇలానా?: తెలంగాణ సర్కారుపై కేంద్రం ఆగ్రహం
హైదరాబాద్: తెలంగాణలో కరోనా మహమ్మారి పరీక్షలు అత్యంత తక్కువగా జరుగుతుండటంపై కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేశారు. కరోనాపై పోరాటంలో ఇది ఎంత మాత్రం మంచిది కాదని తెలంగాణ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
జాతీయ సగటు కంటే చాలా తక్కువ..
ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సుదాన్ తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్కు లేఖ రాశారు. రాష్ట్రంలో ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యే అవకాశం ఉన్నప్పటికీ పరీక్షలు తక్కువగా నిర్వహించిన కారణంగా కరోనా కేసులు బయటపడటం లేదని స్పష్టం చేసింది. జాతీయ సగటు కంటే తెలంగాణలో జరుగుతున్న పరీక్షలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో అత్యంత తక్కువ పరీక్షలు నిర్వహించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. జాతీయ సగటు కంటే కూడా చాలా తక్కువగా పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ సగటు మిలియన్ జనాభాకు 1025 పరీక్షలు జరుపగా.. తెలంగాణలో కేవలం 546 టెస్టులు మాత్రమే చేశారని మండిపడ్డారు.
కరోనా వెంటపడేల చేయొద్దు..
మనం కరోనావైరస్ వెంటపడాలి కానీ.. వైరస్ మన వెంట పడేలా చేయకూడదని ప్రీతి సుదాన్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో పరిస్థితిని సమీక్షించి మరిన్ని టెస్టులు చేయాల్సిన అవసరం ఉందని సీఎస్కు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన 14 లక్షలకు పైగా ఆర్టీ-పిసిఆర్ (రియల్ టైమ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్) పరీక్షల్లో తెలంగాణ రాష్ట్రం వాటా కేవలం 1.5 శాతం లేదా 20,754 మాత్రమే ఉందని ఆమె తెలిపారు.
తెలంగాణ కంటే ఏపీ బెటర్..
ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు రాష్ట్రాల కంటే తెలంగాణలో కరోనా పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని తెలిపారు. కరోనా పరీక్షలు ఎక్కువగా చేస్తే ఎక్కువ కేసులు బయటపడే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో మే 17 నాటికి 1551 కరోనా కేసులు, 34 మరణాలు సంభవించినట్లు తెలిపారు.
ఇక పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లోనూ రోజుకు సగటున 9000 పరీక్షలు నిర్వహిస్తుండగా.. తెలంగాణలో మాత్రం కేవలం 200కుపైగా పరీక్షలు మాత్రమే నిర్వహించడం శోచనీయమని అన్నారు.
టెస్టులు పెంచకపోతే ప్రమాదమే..
జాతీయ కరోనా పాజిటివిటీ రేటు 4.12 ఉండగా, తెలంగాణలో మాత్రం అది 5.26 ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణలో తక్కువగా పరీక్షలు నిర్వహించడం వల్ల కరోనా వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్కువ పరీక్షలు నిర్వహించడం వల్ల ఎక్కువ కేసులు బయటపడితే మహమ్మారిని కట్టడి చేయడం సులభమవుతుందని అన్నారు. కరోనా వ్యాప్తిని మరింత సమర్థవంతంగా అడ్డుకోవచ్చని తెలిపారు. తక్కువగా ఉన్న ప్రభుత్వ ల్యాబ్ లను ఉపయోగించుకుంటున్న రాష్ట్ర పాలకులు.. ప్రైవేట్ ల్యాబ్లను కూడా కరోనా పరీక్షలకు ఉపయోగించుకుంటే బాగుండేదని సూచించారు. ల్యాబ్ లను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో తెలంగాణ సర్కారు విఫలమవుతోందన్నారు.
Recommended Video
సర్కారు ఇలా.. విపక్షాలు అలా
ఈ విషయంపై వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. కార్యదర్శికి కేంద్రం నుంచి లేఖ వచ్చిందని, ఆయన అందుకు బదులిస్తారన్నారు. తెలంగాణలో కరోనా పరీక్షలను పెంచుతున్నామని చెప్పారు. అయితే, ప్రజలు భయాందోళనలకు గురయ్యే అవకాశం ఉన్నందున తాముఅందరికీ పరీక్షలు చేయడం లేదని అన్నారు. తబ్లీఘీ జమాత్ నుంచి వచ్చిన వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నామని, వారిని కలిసిన వారిని కూడా పరీక్షిస్తున్నామని తెలిపారు.
కాగా, కేంద్రం లేఖ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ సర్కారుపై విమర్శల దాడికి దిగాయి. కరోనాను నియంత్రించడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని మండిపడుతున్నారు తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. కరోనా పరీక్షలు నిర్వహించడం విఫలమైన మంత్రి ఈటెల రాజేందర్ తన మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ బీజేపీ నేత కృష్ణసాగర్ రావు డిమాండ్ చేశారు. అయితే విపక్షాల విమర్శలు అర్థరహితమని మంత్రి ఈటెల వ్యాఖ్యానించారు.