బిజెపి మరీ ఘోరం, ఏపీకి ఏమైనా ఇవ్వండి కానీ: ఏకేసిన కెటిఆర్
హైదరాబాద్: తెలంగాణ బిజెపి నేతల పైన తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు గురువారం నాడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఒకేసారి రుణమాఫీ చేయాలని బిజెపి సహా ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. తాము ఆలోచిస్తామని చెప్పామన్నారు.
సభలో బిజెపి సభ్యులు అయితే మరీ ఘోరమన్నారు. బీహార్ రాష్ట్రానికి లక్షా ఇరవై అయిదువేల కోట్ల ప్యాకేజీ ఇచ్చారన్నారు. ఏపీకి ఏం ఇచ్చినా ఫరవాలేదు కానీ, మనకూ న్యాయం చేయాలని బిజెపి నేతలను అడుగుతుంటే, వారికి చేత కావడం లేదన్నారు.
బిజెపి సభ్యులు కిషన్ రెడ్డి, లక్ష్మా రెడ్డిలకు తాము డిమాండ్ చేస్తున్నామని, కేంద్రం నుంచి తెలంగాణకు సహాయం అందించేలా కృషి చేయాలన్నారు. ప్రధాని మోడీ తెలంగాణకు కూడా ప్రధాన మంత్రే అన్నారు. ఆయన కొన్ని రాష్ట్రాలకే ప్రధాని కావాలన్నారు.
ఎన్నికలకు ఎక్కడ ఉంటే అక్కడకు పోవడం కాదని బీహార్ ఎన్నికలను ఉద్దేశించి అన్నారు. అందరికీ సాయం చేయాలన్నారు. రూ.8వేల కోట్లు వన్ టైమ్ సెటిల్మెంట్ చేయమని విపక్షాలు చెబుతున్నాయని, దానికి సహకరించమంటే మాట్లాడటం లేదన్నారు.
రాష్ట్రం విషయంలో కేంద్రం దారుణంగా వ్యవహరిస్తోందని, బీజేపీ నేతలకు సత్తా ఉంటే రాష్ర్టానికి న్యాయం చేసేలా కార్యక్రమాలు చేపట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అడ్వాన్సులు ఇప్పించడం కూడా బీజేపీ నేతలకు చేతకాదని, పంటల బీమా పథకం లోపభూయిష్టంగా మారిందన్నారు.
దాన్ని సవరించాలన్నా కేంద్రం ఉలకదు.. పలకదన్నారు. ఈ విషయంలో బీజేపీ ఎమ్మెల్యేలు లక్ష్మణ్, కిషన్ రెడ్డిని ప్రజలు నిలదీస్తారన్నారు. రాజకీయం కోసం సిద్ధాంతాలు పక్కన బెట్టి కాంగ్రెస్, బిజెపిలు ఒక్కటయ్యాయని ఆరోపించారు.
ఏపీకి ఏం ఇచ్చినా అభ్యంతరం లేదు కానీ
కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేసిందన్నారు. వ్యవసాయానికి అనుసంధానం చేయమని అడిగితే, మొత్తానికే అటకెక్కిస్తున్నారన్నారు. ఏపీ రాష్ట్రానికి కొన్ని వేల కోట్ల ప్రాజెక్టులు ఇస్తారని వార్తలు వస్తున్నాయని, వారికి ఏం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదని, వారు కూడా బాగుపడాలని, కానీ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇవ్వాలన్నారు.
సమైక్యాంధ్రప్రదేశ్లో దగాపడిన తెలంగాణకు కేంద్రం సాయం చేయాలన్నారు. బిజెపి సభ్యులకు పలుకుబడి ఉంటే, సత్తా ఉంటే గల్లీలో కాకుంటే మోడీ వద్దకు వెళ్లి నిలదీయాలని డిమాండ్ చేశారు. రైతుల ఆత్మహత్యల విషయంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉందన్నారు.
60 ఏండ్లలో కాంగ్రెస్, టీడీపీలు చేయలేని పనులను 15 నెలల కాలంలోనే టీఆర్ఎస్ చేసిందన్నారు. తెలంగాణ నుండి ఏడు మండలాలను తీసుకెళ్లారని మండిపడ్డారు. కాంగ్రెస్ 40 ఏళ్లకు పైగా, టిడిపి 17 ఏళ్లు పాలించిందని, వారి పైన తాము రాజకీయం చేయదల్చుకోలేదన్నారు.