తెలంగాణకు కేంద్రం వరాలు: 45,217 ఇళ్లు మంజూరు, 19 పట్టణాల్లో నిర్మాణం
హైదరాబాద్: తెలంగాణలో ఇళ్లులేని నిరుపేదలకు సొంతింటి కల నెరవేరనుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పీఎంఏవై) పథకం కింద తెలంగాణకు కేంద్రం మరో 45,217 ఇళ్లను కేటాయించింది. ఇటీవల మంజూరు చేసిన 10,290 ఇళ్లకు ఇవి అదనం. ఇందుకోసం రూ.678 కోట్లు ఆర్థిక సాయాన్ని కేంద్రం అందజేయనుంది.
ఇవి కాకుండా పేదరిక నిర్మూలన పథకం కింద మరో 12,387 ఇళ్లు కూడా మంజూరైనట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 27 పట్టణాల్లో 45,217 ఇళ్ల నిర్మాణానికి కేంద్రానికి ప్రతిపాదనలు చేసింది. 73 ప్రాజెక్టుల ద్వారా ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి రూ. 3,716.4 కోట్లు ఖర్చవుతుందని పేర్కొంది.
73 ప్రాజెక్టుల్లో 52 గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు చెందినవి కాగా, మిగతా 21 ప్రాజెక్టులు 18 పట్టణ స్థానిక సంఘాలవి ఉన్నాయి. తెలంగాణలోని 19 పట్టణాల్లో వీటిని నిర్మించనున్నారు. రాష్ట్రం నుంచి ప్రతిపాదనలు ఆలస్యంగా అందినప్పటికీ కేంద్రమంత్రి ఎం వెంకయ్యనాయుడు చొరవతో కేంద్ర పరిశీలన-పర్యవేక్షణ కమిటీ ఇళ్లను మంజూరుచేసింది.
తాజాగా మంజూరైన ఇళ్లలో గరిష్ఠంగా హైదరాబాద్కు 29,531 కేటాయించారు. కరీంనగర్కు 1038, గజ్వేల్కు 1842, భువనగిరికి 324, మెదక్కు 2353, పాల్వంచకు 1903, సిరిసిల్లకు 1680, మెట్పల్లికి 1250, జనగాంకు 800, జహీరాబాద్కు 400, నాగర్కర్నూల్కు 250, బోధన్కు 231, నల్లగొండకు 405, వనపర్తికి 592, వికారాబాద్కు 291, అచ్చంపేటకు 500, మహబూబాబాద్కు 800, నిర్మల్కు 500, ఆర్మూర్కు 500 చొప్పున కేంద్రం ఈ ఇళ్లను మంజూరుచేసింది.
తొలి విడతలో సిద్ధిపేట, ఖమ్మం, ఆదిలాబాద్, సూర్యాపేట, మిర్యాలగూడ, భైంసా, మహబూబ్నగర్, నిజామాబాద్, రామగుండం, వరంగల్ పట్టణాలకు ఇండ్లను మంజూరు చేసింది. తాజా కేటాయింపుల్లో ఈ పట్టణాలు మినహా 19 పట్టణాలకు మంజూరైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మంజూరైన 29,254 ఇళ్లకయ్యే ఖర్చు రూ. 1769.86 కోట్లు.
కాగా ఇందులో కేంద్రం వాటా రూ. 438.81 కోట్లు. ఇతర స్థానిక సంస్థలకు మంజూరైన ఇళ్ల సంఖ్య 20,359. వాటి ఖర్చు రూ. 1231.71 కోట్లు. కాగా ఇందులో కేంద్రం వాటా రూ. 305.38 కోట్లు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పరిధిలోకి రాకుండా పేదరిక నిర్మూలన పథకంలో భాగంగా 26 స్థానిక సంస్థల పరిధిలో 12,387 ఇళ్లకు కేంద్రం తన వాటాగా రూ. 185.80 కోట్లు మంజూరు చేయనుందని అధికారులు తెలిపారు.
తొలి విడతలో మంజూరైన 10,290 ఇళ్లకు రూ. 155 కోట్లు ఆర్థికసాయం అందుతుండగా, తాజాగా ప్రకటించిన ఇళ్లకు మరో రూ. 678 కోట్ల మేరకు అందనుంది. కేంద్రం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి ఖర్చు చేస్తామని సీఎస్ఎంసీకి దాన కిషోర్ తెలిపారు.