ఏం జరిగిందంటే..!: రోహిత్ మృతిపై కేంద్రానికి తెలంగాణ రిపోర్ట్, బిజెపి నేతపై దాడి
హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ వేముల ఆత్మహత్యపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి నివేదికను పంపించింది. ఈ నివేదిక మంగళవారం నాడు కేంద్రానికి అందింది. ఈ నివేదికలో తెలంగాణ ప్రభుత్వం పలు అంశాలను పొందుపర్చింది.
రోహిత్ వేముల ఆత్మహత్యకు దారి తీసిన పరిస్థితులు, పోలీసులు తీసుకున్న చర్యలు గురించి దీనిలో వాస్తవాలు వెల్లడించారని హోంశాఖ అధికారి ఒకరు తెలిపారు.
Photos: దత్తాత్రేయ ఇంటి ముట్టడి
బిజెపి నేతపై విద్యార్థుల దాడి
రోహిత్ మృతి నేపథ్యంలో కేంద్రం నుంచి వచ్చిన కమిటీకి బిజెపి ప్రతినిధిగా అభిప్రాయం తెలిపేందుకు మంగళవారం రాత్రి హెచ్సియుకు వచ్చిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాష్ రెడ్డిపై వర్సిటీలో దాడి జరిగింది. చెప్పులు, రాళ్లు విసిరి నినాదాలు చేశారు. స్పందించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఘటనలో వాహనం ధ్వంసం కాగా, ఏసీపీ భుజంగ రావు చేతికి గాయాలయ్యాయి.
విద్యార్థుల ఆందోళనలతో వర్సిటీలో పోలీసులను భారీగా మోహరించారు. ఓవైపు రోహిత్తోపాటు సస్పెన్షన్కు గురైన నలుగురు విద్యార్థుల ఆందోళన కొనసాగుతుండడం.. మరోవైపు వీరికి సంఘీభావంగా మూడు రోజుల నుంచి విద్యార్థిసంఘాల నేతల ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు జరుగుతుండడంతో ఆందోళనలు ఏ మాత్రం చల్లారలేదు. ఈ నేపథ్యంలో మాదాపూర్ డీసీపీ కార్తికేయ ఆధ్వర్యంలో పోలీసులు పెద్దసంఖ్యలో వర్సిటీలో మోహరించారు.