మోస్ట్ ఎఫెక్టెడ్ : తెలంగాణకు 4 కేంద్ర బృందాలు.. దేశవ్యాప్తంగా 50 జిల్లాల్లో స్పెషల్ టీమ్స్..
దేశంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో... వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 50 జిల్లాలకు కేంద్రం ప్రత్యేక బృందాలను(హైలెవల్ మల్టీ డిసిప్లినరీ టీమ్స్) పంపించనుంది. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో ఈ 50 మున్సిపాలిటీల్లోనే సగానికి పైగా కేసులున్నాయి. పకడ్బందీ కంటైన్మెంట్ చర్యలు,టెస్టింగ్,కరోనా పేషెంట్స్ కాంటాక్ట్స్ ట్రేసింగ్ కోసం రాష్ట్రాలకు ఈ బృందాలు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాయి.
ఏయే రాష్ట్రాలకు ఎన్ని బృందాలు..
కేంద్రం పంపించిన ప్రత్యేక బృందాల్లో తెలంగాణకు 4 బృందాలు రానున్నాయి. అలాగే మహారాష్ట్రకు 7,తమిళనాడుకు 7,రాజస్తాన్కు 5,హర్యానాకు 4,గుజరాత్కు 3,కర్ణాటకకు 4,ఉత్తరాఖండ్కు 3,మధ్యప్రదేశ్కు 5,పశ్చిమ బెంగాల్కు 3,ఢిల్లీకి 3,బీహార్కు 4,ఉత్తరప్రదేశ్కు 4,ఒడిశాకు 5 కేంద్ర బృందాలు వెళ్లనున్నాయి.
ప్రతీ బృందంలో ముగ్గురు సభ్యులు..
కేంద్రం పంపించిన ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులు ఉండనున్నారు. వీరిలో ఇద్దరు పబ్లిక్ హెల్త్ ఎక్స్పర్ట్ లేదా ఎపిడెమాలజిస్ట్ లేదా క్లినీషియన్ ఉంటారు. అలాగే సీనియర్ జాయింట్ సెక్రటరీ హోదా కలిగిన ఓ నోడల్ అధికారి ఉంటారు. ఈ బృందాలు ఫీల్డ్లో పర్యటించి కంటైన్మెంట్ చర్యలు,క్లినికల్ మేనేజ్మెంట్ ఇతరత్రా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వాలకు సహాయ సహకారాలు అందిస్తాయి. మెరుగైన సమన్వయం,ఫీల్డ్లో సత్వర చర్యలు,వ్యూహాత్మక విధానాల కోసం ప్రత్యేక బృందాలను మోహరించామని కేంద్రం స్పష్టం చేసింది. కరోనాతో ఎఫెక్ట్ అయిన మున్సిపాలిటీలు,జిల్లాలు కేంద్ర బృందాలతో సమన్వయంలో ఉండాలని కేంద్రం సూచించింది.
కరోనా నియంత్రణ కోసమే..
దేశంలో కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం దేశంలో 2,76,125 కరోనా పాజిటివ్ కేసులున్నాయి. ఇందులో 1,34,230 యాక్టివ్ కేసులు ఉండగా.. 1,34,161 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ 7719 మంది కరోనా కారణంగా మృత్యువాతపడ్డారు. ముఖ్యంగా ముంబై,ఢిల్లీ,చెన్నై వంటి ప్రధాన నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. హైదరాబాద్లోనూ కొద్దిరోజులుగా సగటున 100 కేసులు నమోదవుతున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మెడికల్,హెల్త్ కేర్ వ్యవస్థపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం కరోనా నియంత్రణలో భాగంగా ప్రత్యేక బృందాలను రాష్ట్రాలకు పంపించింది.