తవ్వకాల్లో పురాతన బిందె: వజ్ర, వైడూర్యాలనుకుంటే.. మట్టి, నీళ్లు
మహబూబ్ నగర్: జిల్లాలోని గద్వాల పట్టణం కూరగాయల మార్కెట్ వద్ద తవ్వకాలు జరుపుతుండగా పురాతన బిందె ఒకటి లభ్యమైంది. దాంట్లో, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం ఉంటుందని జోరుగా ప్రచారం సాగింది. తీరా దానిని తెరిచి చూస్తే మట్టి, నీళ్లు తప్ప ఏం కనిపించలేదు.
దీంతో, ఎంతో ఉత్కంఠతో అక్కడకు వచ్చిన వారు ఉసూరుమంటూ వెళ్లిపోయారు. గద్వాలలో మురుగు కాల్వ కోసం తవ్వుతుండగా పురాతన బిందె ఒకటి లభ్యమైంది. ఇది నగరంలో కలకలం సృష్టించింది. పెద్ద ఎత్తున ధనం దొరికిందన్న ప్రచారంతో పట్టణ ప్రజలకు అక్కడకు తరలి వెళ్లారు.
స్థానిక కూరగాయల మార్కెట్ కూల్చి, దాని స్థానంలో కొత్త సముదాయాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం జెసిబితో మురుగు కాల్వను తవ్వుతుండగా పక్కనే ఉన్న ఓ పురాతన గోడ కూలింది. అందులో ఓ కంచు బిందె బయటపడింది.
ఈ వార్త గద్వాలలో వ్యాపించింది. పెద్ద ఎత్తున ధనం ఉన్న లంకె బిందె దొరికిందన్న వదంతులు వ్యాపించాయి. వందల సంఖ్యలో జనం అక్కడకు వచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు, ఇంచార్జ్ తహసీల్దారు అక్కడకు చేరుకున్నారు. బిందెను బయటకు తీయించారు.
ఈ క్రమంలో దానిని చూసేందుకు ప్రజలు బుధవారం సాయంత్రం ఎగబడ్డారు. తోపులాట జరిగింది. గురువారం కూడా ప్రజలు తండోపతండాలుగా తరలి వచ్చారు. పోలీసులు లాఠీలకు పని చెప్పారు. బిందెను బుధవారం తహసీల్దారు కార్యాలయానికి చేర్చారు.
కార్యాలయంలోను ఓ గదిలో భద్రపరిచి సీల్ వేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. గురువారం బిందెను తెరిచారు. అయితే, అందులో నీళ్లు, మట్టి మాత్రమే కనిపించాయి. పురావస్తు శాఖ ఆద్వర్యంలో బిందెను తెరిచారు.
బిందెకు పైన కప్పును నట్లతో బిగించారు. రెండు రంద్రాలు ఉన్నాయి. గతంలో ఇలాంటి కంచు బిందెల్లో నీళ్లు వేడి చేసేవారని, ఒక రంధ్రం నుంచి చల్ల నీళ్లు, పంపితే మంటపెడితే మరో రంధ్రం నుంచి వేడి నీళ్లు వచ్చేవని పెద్దలు చెబుతున్నారు.