72గంటల్లో ప్రకటనల తొలగింపు, అధికారిక వాహనాలు వినియోగించొద్దు: సీఈఓ రజత్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల నియమావళిపై కేంద్ర ఎన్నికల కమిషన్ స్పష్టత నిచ్చిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ పేర్కొన్నారు. తక్షణమే ఎన్నికల ప్రవర్తనా నియమావళి పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న అన్ని పోస్టర్లు, కటౌట్లను 72గంటల్లోనే తొలగించాలని రజత్కుమార్ స్పష్టం చేశారు.
కేంద్రం ఎన్నికల సంఘం తెలంగాణతో పాటు నాలుగు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత శనివారం సాయంత్రం సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కిందకు వచ్చే అంశాలేంటో ఈసీ స్పష్టంగా చెప్పిందని వివరించారు.
24 గంటల్లో రైల్వే స్టేషన్, బస్స్టేషన్, విమానాశ్రయాల్లో బ్యానర్లు అన్నీ తొలగించాలని ఆదేశించారు. ఇంటి యజమాని అనుమతితోనే బ్యానర్లు కట్టాలి, గోడపత్రికలు అతికించాలన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ప్రకటనలు ఉండకూడదని స్పష్టం చేశారు. రాత్రి 10గంటల నుంచి ఉదయం 6గంటల వరకు ప్రచారంపై నిషేధమని అన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు 72 గంటల్లో ఆపేయాలని స్పష్టం చేశారు. అధికారిక వాహనాల వినియోగం తక్షణమే రద్దు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి జిల్లా కార్యాలయంలో ఫిర్యాదుల కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని రజత్కుమార్ వివరించారు.