తెలంగాణ విద్యుత్ సర్వర్లపై చైనా హ్యాకర్లు దాడికి యత్నం: అలర్ట్గా ఉన్నామన్న ట్రాన్స్స్కో సీఎండీ
హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ సర్వర్లు హ్యాక్ చేసేందుకు చైనా హ్యాకర్లు ప్రయత్నించినట్లు తెలిసింది. దీనిపై తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు స్పందించారు. తెలంగాణ సర్వర్లలోకి చైనాకి చెందిన థ్రెట్ యాక్టర్ హ్యాకింగ్ గ్రూప్ ప్రవేశించి విద్యుత్ వ్యవస్థను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని రెస్పాన్స్ టీం ఆఫ్ ఇండియా(సెర్ట్-ఇన్) గుర్తించి రాష్ట్రాన్ని అప్రమత్తం చేసిందని ప్రభాకర్ రావు తెలిపారు.
భారతదేశ గ్రిడ్ మాత్రమే కాకుండా రాష్ట్ర గ్రిడ్, విద్యుత్ సరఫరా వ్యవస్థ మొత్తం ప్రభావితం అయ్యే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని కొన్ని సబ్ స్టేషన్లకు థ్రెట్ యాక్టర్ ప్రవేశించినట్లు తెలుస్తోందన్నారు.
రాష్ట్ర విద్యుత్ సాంకేతిక విభాగం వెంటనే అప్రమత్తమై వాటిని ఎక్కడికక్కడ నిరోధించే చర్యలు తీసుకుంటుందని ప్రభాకర్ రావు తెలిపారు. గ్రిడ్కు సంబంధించిన అధికారులు, సాంకేతిక నిపుణులతో సమావేశం నిర్వహించామని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని సీఎండీ ప్రభాకర్ రావు వెల్లడించారు.
భారత పవర్ గ్రిడ్పై చైనా కుట్ర: సీరమ్ ఇనిస్టిట్యూట్, భారత్ బయోటెక్ సంస్థలపై హ్యాకర్ల దాడి
వినియోగదారులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని ఆయన స్పష్టం చేశారు.
కాగా, భారత ప్రభుత్వానికి చెందిన విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్స్లు, లోడ్ డిస్పాచ్ సెంటర్లు తదితర వాటిని చైనా ప్రభుత్వ మద్దతుతో నడుస్తున్న హ్యాకింగ్ గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయని అమెరికాకు చెందిన ఓ సంస్థ వెల్లడించింది. గత అక్టోబర్ నెలలో దేశ వాణిజ్య రాజధాని ముంబైలో భారీ పవర్ కట్ వెనుక డ్రాగన్ హస్తం ఉందని, ఇది భారత్కు ఓ హెచ్చరిక అని పేర్కొంది. అయితే, హ్యాకర్ల ప్రభావం పవర్ గ్రిడ్లపై పనిచేయలేదని కేంద్ర ప్రభుత్వం స్పస్టం చేసింది.
గల్వాన్ ఘటన తర్వాత నాలుగు నెలలకే అక్టోబర్ 12న ముంబైలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అనేక రైళ్లు ఆగిపోయాయి. శివారు ప్రాంతాల్లో అయితే 10 నుంచి 12 గంటలు కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే, ఈ విద్యుత్ సంక్షోభానికి సరిహద్దు వివాదంతో సంబంధం ఉందని అమెరికాలోని రికార్డెడ్ ఫ్యూచర్ అనే సంస్థ తన అధ్యయనంలో తేల్చింది. సరిహద్దులో ఉద్రిక్తతల సమయంలో భారత పవర్ గ్రిడ్పై చైనా సైబర్ నేరగాళ్లు గురిపెట్టారని, సరిహద్దులో భారత్ వెనక్కి తగ్గకపోతే దేశమంతా అంధకారంలోకి వెళ్తుందని చైనా 'ముంబై పవర్ కట్' ద్వారా హెచ్చరించిందని ఆ సంస్థ వెల్లడించింది. చైనా ప్రభుత్వంతో సంబంధాలున్న రెడ్ఎకో గ్రూప్ అనే సంస్థ మనదేశంలోని ఎన్టీపీసీ సహా ఐదు ప్రైమరీ లోడ్ డిస్ప్యాచ్ సెంటర్లు, విద్యుత్ సంస్థల కంప్యూటర్ నెట్వర్క్లను లక్ష్యంగా చేసుకున్నాయని తెలిపింది. విద్యుత్ ఉత్పత్తి, సరఫరా సంస్థల్లోని 21 ఐపీ అడ్రస్ లపై హ్యాకర్లు దాడి చేసినట్లు పేర్కొంది. ఈ ఐపీ అడ్రస్ ల ద్వారా విద్యుత్ సరఫరాను నిర్వహించే కంట్రోల్ సిస్టంలోకి చైనా హ్యాకర్లు మాల్వేర్ను చొప్పించినట్లు వెల్లడించింది.