కేసీఆర్ తియ్యగా: చాడ, షార్ట్ ఫిలిం ఫెస్ట్కి అనుష్క!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు తియ్యగా మాట్లాడినంత మాత్రాన ప్రజల కడుపు నిండదని చాడ వెంకట రెడ్డి మండిపడ్డారు. బంగారు తెలంగాణ చేస్తామని చెబుతున్నారని, కానీ కావాల్సింది అది కాదని బతుకు తెలంగాణ కావాలన్నారు.
రైతు ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉందని చెప్పారు. రైతు సమస్యల పైన త్వరలో రైతు సమన్వయక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
వరంగల్లో 15నుండి ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్
వరంగల్ జిల్లాలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఈనెల 15 నుండి మూడు రోజుల పాటు తొలిసారిగా ఇంటర్నేషనల్ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించనున్నామని గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ తెలిపారు.
శనివారం ఉదయం హన్మకొండ ఆఫీసర్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన ఫిలిం ఫెస్టివల్ వివరాలను వెల్లడించారు. గతంలో కేవలం రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్లో మాత్రమే ఇలాంటి ఫిలిం ఫెస్టివల్ నిర్వహించేదని, కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా చొరవ తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రథమంగా వరంగల్ నగరంలో అంతర్జాతీయ షార్ట్ ఫిలిం ఉత్సవాలను మూడు రోజులు ఏర్పాటు చేయనున్నామని ఆయన తెలిపారు.
ఈ ఫెస్టివల్ ద్వారా జిల్లాలోని చారిత్రాత్మక ప్రదేశాలు, కట్టడాలు గుర్తింపు పొందడంతో పాటు పర్యాటక పరంగా ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ఈ ఫెస్టివల్లో 20 దేశాల నుండి 100 షార్ట్ ఫిలిం ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్నారని, ఈ వేడుకలకు రాజకీయ, సినీరంగ ప్రముఖులను ఆహ్వానించామని తెలిపారు. ఈ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి దర్శకుడు గుణశేఖర్, సినీ నటి అనుష్క హాజరయ్యే అవకాశం ఉందన్నారు.