రెచ్చిపోయిన చైన్స్నాచర్లు: ఆస్పత్రికి వెళ్తున్న మహిళ గొలుసు చోరీ, మహిళకు గాయాలు
హైదరాబాద్: నగరంలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు చేపట్టినప్పటికీ చైన్ స్నాచర్లు చోరీలను ఆపడం లేదు. తాజాగా మంగళవారం ఉదయం ఆస్పత్రికి తండ్రితో కలిసి స్కూటీపై వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును చైన్ స్నాచర్లు అపహరించారు.
కాలు బాగాలేకపోవడంతో స్లోగా వెళ్తున్న వారిని లక్ష్యంగా చేసుకున్న చైన్ స్నాచర్లు పల్సర్ బైకుపై వచ్చి గొలుసు దొంగతనం చేశారు. గొలుసు గట్టిగా లాగడంతో స్కూటీపై నుంచి మహిళ కిందపడిపోయింది.
దీంతో ఆమెకు గాయాలయ్యాయి. ఇదంతా సమీపంలోని సిసి కెమెరాలో రికార్డైంది. గాయాలపాలైన మహిళను కంచన్ బాగ్ అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, చైన్ స్నాచర్ల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
విద్యార్థిని కిడ్నాప్నకు యత్నం
ఘట్కేసర్ పోలీసుస్టేషన్ పరిధిలో ఆరో తరగతి విద్యార్థిని కిడ్నాప్ వ్యవహారం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన ప్రకారం.. ఘట్కేసర్ ఎన్ఎఫ్సీనగర్ ప్రాంతానికి చెందిన గడ్డం కృష్ణ కూతురు అశ్విత స్థానిక కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది.
సోమవారం సాయంత్రం ట్యూషన్ ముగించుకుని ఇంటికి వెళ్ళేందుకు బయట నిలబడింది. బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి దగ్గర దిగపెడతామని ఎక్కించుకున్నారు. మూడు గంటలుగా విద్యార్థినిని తిప్పి కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. రాత్రి 9.30 గంటల ప్రాంతంలో బస్స్టాప్ వద్దకు రాగానే అశ్విత కేకలు పెట్టడంతో దుండగులు ఆమెను అక్కడే వదిలేసి పోయారు.
ఆ తర్వాత స్థానికుల సహాయంతో అశ్విత క్షేమంగా ఇంటికి చేరుకుని జరిగిన విషయం వివరించింది. తన కూతురుని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్కు యత్నించారని తండ్రి గడ్డం కృష్ణ ఘట్కేసర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులు కిడ్నాప్ కేసును నమోదు చేసుకుని దర్యాప్తును ప్రారంభించారు.