పాల ప్యాకెట్ కోసం వెళ్లి వస్తుండగా: చైన్స్నాచర్ దాడిలో గాయపడ్డ మణెమ్మ(ఫోటోలు)
హైదరాబాద్: ఇంటి సమీపంలోని దుకాణానికి పాల ప్యాకెట్ కోసం వెళ్తున్న మహిళ మెడలోని సుమారు 6 తులాల బంగారు గొలుసును దుండగులు లాక్కెళ్లిన సంఘటన సరూర్ నగర్ ఠాణా పరిధిలో సోమవారం చోటు చేసుకుంది.
పోలీసులు కథనం ప్రకారం చంపాపేట సూర్యోదయ కాలనీకి చెందిన మణెమ్మ (52) కాలనీలోనే దుకాణానికి వెళ్లి తిరిగి వస్తుండగా ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆమె మెడలోని రూ. 1.50 లక్షల విలువైన బంగారు గొలుసు లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
స్థానికంగా అమర్చిన సీసీ కెమెరా పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. నిందితులను గుర్తించామని త్వరలో పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు. చోరీ కోసం బంగారు గొలుసు లాగడంతో మణెమ్మ కిందపడి తలకు తీవ్రగాయమైంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆసుపత్రికి తరలించారు. సోమవారం మొత్తం మీద నగరంలో వేర్వేరు ప్రాంతాల్లో మూడు చోట్ల చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు.
సంతోష్ నగర్ కాలనీకి చెందిన ఎ.భారతి (68) సోమవారం ఉదయం ఇంటి ముందు ముగ్గు వేస్తోంది. పల్సర్ బైక్పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆమెను కత్తితో బెదిరించి పుస్తెలతాడును లాక్కెళ్లారు. దుండగుల బెదిరింపుతో ఆమె స్రృహతప్పి పడిపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
ఎల్బీ నగర్లో నివాసం ఉంటోన్న సావిత్రమ్మ (60) నల్లగొండకు వెళ్లేందుకు ఎల్బీ నగర్ చౌరస్తాలో నార్కెట్పల్లి డిపోకు చెందిన బస్సు సోమవారం ఎక్కింది. బంగారు ఆభరణాలను బ్యాగ్లో పెట్టింది. వనస్థలిపురం పనామా చౌరస్తా వద్దకు వెళ్లిన తర్వాత అనుమానం రావడంతో బ్యాగ్ను చూసుకోగా అందులో పెట్టిన ఐదు తులాల బంగారు ఆభరణాలు పర్సు కనిపించలేదు.
దీంతో డ్రైవర్ బస్సును నేరుగా వనస్థలిపురం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడు. ప్రయాణికులందరినీ తనిఖీ చేసినా ఫలితం లేకపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.