అక్కడ లేవు, కానీ ఉన్నాయి!: సీతమ్మ మంగళసూత్రం లభ్యం
ఖమ్మం: ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామ వారి ఆలయంలో మాయమైన 71 గ్రాముల సీతమ్మవారి మంగళసూత్రాలు, లక్ష్మణస్వామివారి లాకెట్ దొరికినట్లు సమాచారం. శనివారం ప్రధాన ఆలయంలోని బంగారు ఆభరణాల బీరువాను అర్చకులు తనిఖీ చేయగా అరలో ఇవి ఉన్నట్లు గుర్తించారు. ఆగస్టు 13 నుంచి 18 వరకు పవిత్రోత్సవాలు జరగడం వల్ల నిత్య కల్యాణాలను నిలిపేశారు.
ఆగస్టు 19న నిత్యకల్యాణం కోసం మూర్తుల ఆభరణాలను పరిశీలించగా ఈ ఆభరణాలు మాయమైనట్లు తేలింది. సీఐ శ్రీనివాసులు నేతృత్వంలో ఒకరిద్దరు అర్చకులపై అనుమానంతో నిఘా ఉంచగా.. అనూహ్యంగా నగల బీరువాలోనే రెండు ఆభరణాలు లభ్యమయ్యాయి.
శనివారం ఈవో రమేష్బాబు మాట్లాడుతూ...ఆభరణాలు ఉండాల్సినచోట లేకపోవడంతోనే వివాదంగా మారిందన్నారు. అర్చకుల్లో కొంతమంది మధ్య పొసగకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తినట్లు గుర్తించామన్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యం కనబరచినవారిని సస్పెండ్ చేస్తామన్నారు.
అయితే, ఇంతకుముందు తనిఖీ చేసినప్పుడు కనబడని నగలు...ఇప్పుడు దొరకడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఐదుగురు అర్చకులపై కేసులు నమోదయ్యాయి. బాధ్యులైన వారిని సస్పెండ్ చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిని బదిలీ చేస్తామని ఈవో తెలిపారు.