‘అరెస్టుల అసెంబ్లీ’: ‘కేసీఆర్’ దౌర్భాగ్యమంటూ రేణుక తీవ్ర వ్యాఖ్యలు
తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు.
Recommended Video
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రజావ్యతిరేక కార్యక్రమాలు చేపడుతుందని ఆరోపిస్తూ శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన చలో అసెంబ్లీని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. గాంధీభవన్ వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. అక్కడికి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలను అరెస్టు చేస్తున్నారు.
పటాన్చెరు, రామచంద్రాపురం, భానూరు, జిన్నారం, హయత్నగర్లో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు అసెంబ్లీ గేటు వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు మాత్రమే అసెంబ్లీ లోనికి అనుమతి ఇస్తున్నారు.
అంజన్ కుమారుడి అరెస్ట్
చలో అసెంబ్లీ నేపథ్యంలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్కు చెందిన పాతబస్తీలోని ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అంజన్ కుమారుడు అరవింద్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. అరెస్టుల పట్ల కాంగ్రెస్ నేతల నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉంటే.. టీడీపీ-బీజేపీ నేతలు పాదయాత్రగా అసెంబ్లీకి చేరుకునేందుకు సిద్ధమయ్యారు.
నియంతగా కేసీఆర్: డీకే అరుణ
ప్రతిపక్షాల గొంతునొక్కడం సరికాదని మాజీ మంత్రి డీకే అరుణ అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. రుణమాఫీ ఇప్పటికీ పూర్తిగా అమలు కావడం లేదు. సీఎం కేసీఆర్ మాటల గారడితో కాలం గడుపుతున్నారని మండిపడ్డారు. నియంతలు పిరికిపందలు అవుతారని అన్నారు. సీఎం కేసీఆర్ నియంతగా వ్యవహరిస్తున్నారని అన్నారు.
వేలాది మంది రోడ్లపైకి వచ్చారు: కోమటిరెడ్డి, షబ్బీర్
గాంధీభవన్లోనే పదివేల మంది ఉన్నారని, వేలాది మంది రోడ్లపైకి వచ్చారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేసీఆర్ ఇచ్చిన రుణమాఫీ రైతుల వడ్డీలకే సరిపోలేదని అన్నారు. ప్రజలకు, రైతులకు ఈ ప్రభుత్వంలో న్యాయం జరగడం లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ అన్నారు. దున్నపోతుపై వర్షం పడ్డరీతిలో ప్రభుత్వం పనిచేస్తోంది. ఏసీలో కూర్చుని సీఎం అంతా బాగా ఉందని అంటున్నారని మండిపడ్డారు. మేం చేస్తే అరెస్టులు, కోదండరాం చేస్తే అరెస్టులు, అరెస్టులతోనే ప్రభుత్వం నడుస్తుందని అన్నారు.
ఎక్కడికక్కడే నేతల అరెస్టులు
కాంగ్రెస్ నేతలు మర్రి శశిధర్ రెడ్డి, డీకే అరుణ, సునీత, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తోపాటు పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి ఆరోపించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఈ ప్రభుత్వం పట్టించుకోవడట్లేదని డీకే అరుణ అన్నారు.
టీడీపీ-బీజేపీ పాదయాత్ర
అధిక వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ.. టీడీపీ, బీజేపీ నేతలు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. బషీర్బాగ్ ఎల్బీస్టేడియం నుంచి అసెంబ్లీ వరకూ కొనసాగిన ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు కిషన్రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్రమణ, ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య పాల్గొన్నారు. భారీ వర్షాలకు దెబ్బతిన్న వరి, జొన్న, పత్తిని ప్రదర్శిస్తూ.. ర్యాలీగా అసెంబ్లీకి చేరుకున్నారు.
తీవ్రస్థాయిలో రేణుకా చౌదరి ఫైర్
తెలంగాణను కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఇచ్చారని రేణుక చౌదరి చెప్పారు. రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. పశువులను కొన్నట్లుగా ఎమ్మెల్యేలను కొంటున్నారని సీఎం కేసీఆర్పై మండిపడ్డారు. తనపై పోలీసులు చేయి వేశారని, ఒక్క రేణుక కోసం వందలమంది పోలీసులా? అంటూ మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి ఖాయమని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. కేసీఆర్ సీఎంగా ఉండటం మన దౌర్భాగ్యమంటూ తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్ గర్జిస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అంటూ హెచ్చరించారు.
ఇది ప్రజల ప్రభుత్వం
కాగా, కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు, రైతులదేనని టీఆర్ఎస్ నేతలు అన్నారు. వారి సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. నాటి సీఎం కిరణ్ ఒక్క రూపాయి తెలంగాణకు ఇవ్వనంటే ఏ తెలంగాణ కాంగ్రెస్ నేత కూడా మాట్లాడలేదని, ఇప్పుడేమో రోడ్లపైకి వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వందలాది చెరువుల్లో నీళ్లు నింపామని, ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పారు.