దళితులంటే ఎందుకంత చిన్న చూపు చంద్రబాబు: మోత్కుపల్లి
దళితుల పట్ల చంద్రబాబుకు అస్సలు ప్రేమలేదని కేవలం ఓట్లకోసమే దళితులపై ప్రేమ ఉన్నట్లు నటిస్తున్నారని టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. 40 ఏళ్ల రాజకీయం అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు దళితులపట్ల అనుచిత వ్యాఖ్యలు ఎలా చేశారని ఆయన ప్రశ్నించారు. తక్కువ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు మాటలను మోత్కుపల్లి ఉటంకించారు. రాజ్యాంగ రూపకర్త, దళిత వర్గాలకు ఆశాజ్యోతి అయిన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ప్రవేశపెట్టిన విధానాలను చంద్రబాబు అణగదొక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబుకు దళితుల అవసరం ఉందని ఫైర్ అయిన మోత్కుపల్లి వారి బాగోగుల గురించి ఏనాడు ఆలోచన చేయలేదన్నారు.
Recommended Video
ఇక దళిత తేజం పేరుతో చంద్రబాబు పెడుతున్న సమావేశాలు కేవలం పబ్లిక్ స్టంట్ అని మోత్కుపల్లి అన్నారు. మరోసారి దళితులను మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారని చెప్పారు. మాల మాదిగల మధ్య చిచ్చు పెట్టి గత ఇరవై ఏళ్లుగా పబ్బం గడుపుకుంటున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో దళితులను వాడుకుని ఆ తర్వాత వారిని ముంచేయడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని మోత్కుపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక రానున్న ఎన్నికల్లో దళితులు చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. మరోసారి మొసలి కన్నీరు కారుస్తూ, దళితులపై కపట ప్రేమ నటిస్తారని... జాగ్రత్తగా ఉండాలని మోత్కుపల్లి సూచించారు.