గవర్నర్ పదవిపై మోత్కుపల్లి ఆరా, పొత్తులపై తొందరెందుకన్న బాబు
హైదరాబాద్: పొత్తులపై ఇప్పుడే చర్చలు అనవసరమని, ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చించి నిర్ణయం తీసుకొంటామని తెలుగుదేశం పార్టీ జాతీయ అద్యక్షుడు చంద్రబాబునాయుడు తెలంగాణ నేతలకు చెప్పారు.
రెండు రోజుల పాటు హైద్రాబాద్ పర్యటనకు వచ్చిన ఏపీ సీఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ఆదివారం నాడు టిడిపి నేతలతో చర్చించారు. పొత్తులపై తెలంగాణ టిడిపి నేతలు పరస్పర విరుద్దమైన ప్రకటనలు చేశారు.
గందరగోళం: టిఆర్ఎస్తో పొత్తుపై చంద్రబాబు ఇలా..రేవంత్ దారెటు?
తెలంగాణ టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు టిఆర్ఎస్తో పొత్తు ఉంటుందని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే టిడిపి పుట్టిన విషయాన్ని మోత్కుపల్లి గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి వర్గీయులు మాత్రం టిఆర్ఎస్తో పొత్తును తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో కొంత గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలోనే తెలంగాణ టిడిపి నేతలతో టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
ఎన్నికల సమయంలోనే పొత్తులు
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉంటుందనే అంశంపై ఇంత త్వరగా మాట్లాడాల్సిన అవసరం లేదని బాబు స్పష్టం చేశారు. 2019 ఎన్నికల్లో పొత్తుల విషయమై తెలంగాణ టిడిపి నేతల మధ్య పరస్పర విరుద్ద ప్రకటనల నేపథ్యంలో పొత్తుల విషయమై చంద్రబాబునాయుడు స్పష్టత ఇచ్చారు. ఎన్నికల సమయంలో పొత్తు విషయాన్ని తాను చూసుకొంటానని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.దీంతో పొత్తులపై పార్టీ నేతలు స్పందించకూడదని చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు హితవు పలికారు.
గవర్నర్ పదవిపై ఆరా తీసిన మోత్కుపల్లి
తనకు గవర్నర్ పదవి వస్తుందనే ప్రచారం జరిగిందని పార్టీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములు చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్ళారు.ఈ విషయమై హమీ ఇచ్చిన విషయాన్ని కూడ చంద్రబాబునాయుడుకు మోత్కుపల్లి గుర్తుచేశారని సమాచారం.అయితే కేంద్రం తాజాగా ప్రకటించిన జాబితాలో పేరు లేకపోవడంపై తెలుగుదేశం పొలిట్బ్యూరో సభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చంద్రబాబును అడిగినట్లు సమాచారం. దీనిపై తాను కేంద్రానికి చెప్పినా స్పందించలేదని చంద్రబాబునాయుడు మోత్కుపల్లికి చెప్పారని సమాచారం. అయితే ఈ విషయమై వ్యక్తిగతంగా మాట్లాడతానని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు మోత్కుపల్లికి చెప్పారని సమాచారం.
సింగరేణి ఎన్నికల ఫలితాలపై చంద్రబాబు ఆరా
సింగరేణి ఎన్నికల్లో ఏ సంఘానికి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయమై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు తెలంగాణ టిడిపి నేతలు సూచించారు.
తెరాస పార్టీ అనుబంధ సంఘం ఎలా నెగ్గిందనే వివరాలను పార్టీ నేతలు ఆయనకు వివరించారు. తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, పార్టీ చేపడుతున్న కార్యక్రమాలపై చర్చించి విశ్లేషించి పలు సూచనలిచ్చారు.
పార్టీ కమిటీల్లో అందరికీ ప్రాధాన్యమివ్వాలి
టిడిపి కేంద్ర, రాష్ట్ర కమిటీలు ప్రకటించినా, ఇంకా ఎవరికైనా అవకాశమివ్వాల్సి ఉంటే వారి పేర్లను సూచించాలని నేతలను కోరారు. తెలంగాణలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ పార్టీ పటిష్ఠానికి చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలన్నారు. నాయకులంతా సమన్వయంతో పనిచేయాలని చంద్రబాబునాయుడు సూచించారు.. పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ నూతనంగా ఏర్పాటైనందున ఈ నెల 12న సమావేశం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అదేరోజు తాను హైదరాబాద్ వస్తానని చంద్రబాబునాయుడు చెప్పారు.ఈ కమిటీతో సమావేశం కానున్నట్టు చంద్రబాబునాయుడు హమీ ఇచ్చారు.
ఆలేరుకు అన్యాయం చేయకండి
.. దేవాదుల ప్రాజెక్టు విషయంలో ఆలేరు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందన్నారు తెలంగాణ టిడిపి సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహ్ములు చెప్పారు. తెదేపా హయాంలో ఈ ప్రాజెక్టు పనులు ప్రారంభించారని ఆయన గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం జనగాం వరకే నీటిని పరిమితం చేసిందన్నారు. ఈ ప్రాజెక్టులో భాగమైన తపాసు రిజర్వాయర్ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నా సాగునీరు ఇక్కడికి ఇవ్వకుండా గజ్వేల్, సిద్దిపేటకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. సీఎం కేసీఆర్కు సొంత నియోజకవర్గంపై ఉన్న ప్రేమ ఇతర ప్రాంతాలపైనా చూపాలన్నారు. రాజాపేట మండలానికి దేవాదుల నీరివ్వకుంటే పోరాటం చేస్తామన్నారు. ఈ నెల 9 నుంచి 12 వరకూ రిలే దీక్షలు చేస్తున్నట్లు తెలిపారు.