కెసిఆర్కు చంద్రబాబు ఝలక్: మోడీ అపాయింట్మెంట్ రద్దు వెనక..?
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కెసిఆర్కు ప్రధాని మోడీ ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు వెనక చంద్రబాబు హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణపై మాట్లాడేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన అపాయింట్మెంట్ రద్దు వెనక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అపాయింట్ మెంట్ రద్దు వెనక చంద్రబాబు హస్తం ఉందని ఎమ్మార్పీయస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ అన్నారు.
కెసిఆర్ నేతృత్వంలోని తెలంగాణ అఖిల పక్ష బృందానికి ప్రధాని ఇచ్చిన అపాయింట్మెంట్ ఆకస్మాత్తుగా రద్దయింది. ఈ రద్దు వెనక ఇద్దరు నాయుళ్ల కుట్ర ఉందని శ్రీనివాస్ చంద్రబాబు, వెంకయ్యలను ఉద్దేశించి అన్నారు. ప్రధానిని కలిసేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్కు తొలుత అనుమతి ఇచ్చిన పిఎంవో తర్వాత ఆ దాన్ని రద్దు చేస్తే బిజెపి రాష్ట్ర నాయకులు ఏం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
ఈ నెల 15వ తేదీలోగా ముఖ్యమంత్రి కెసిఆర్కు ప్రధాని అపాయింట్మెంట్ ఇవ్వకపోతే బిజెపి నాయకులను రాష్ట్రంలో ఎక్కడికక్కడ అడ్డుకుంటామని ఆయన హెచ్చరించారు. నిజానికి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చంద్రబాబు కూడా మద్దతు ప్రకటించారు. ఎమ్మార్పీయస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగకు మద్దతు పలికారు కూడా.
ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు తెలుగుదేశం పార్టీ విధానపరంగా మద్దతు ప్రకటించింది. అయితే, రాష్ట్ర విభజన తర్వాత పరిస్థితి మారిపోయింది. తెలంగాణలోని ఎస్సీలో మెజారిటీ మాదిగలది కాగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాలలది. అఖిలపక్ష బృందాన్ని తీసుకుని వెళ్తే రాజకీయంగా కూడా తెలంగాణలో కెసిఆర్కు లాభించే అవకాశం ఉంది.
కెసిఆర్ ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా ప్రధానిని కూడా కదిలిస్తే చంద్రబాబుకు చిక్కులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఆయనపై మాదిగల నుంచి ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. అటు కెసిఆఆర్ లాభపడడం, ఇటు తనకు చిక్కులు వచ్చే ప్రమాదం ఉండడం వల్ల చంద్రబాబు ప్రధాని అపాయింట్మెంట్ను రద్దు చేయించారనే మాట వినిపిస్తోంది.