చంద్రబాబుకు మండుతోంది: కెటిఆర్, 'పేరెంట్స్ని చంపి వదిలేయమన్న కొడుకు' పిట్టకథ
మహబూబ్ నగర్: పాలమూరు దాహార్తి తీర్చేందుకు 40 టిఎంసీల నీటిని ఉపయోగించుకుంటామంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడుపు మండుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం నాగసాలలో వాటర్ గ్రిడ్ పనులకు మంత్రి కేటీఆర్ బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి లక్ష్మారెడ్డి, ఎంపీ జితేందర్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కెటిఆర్ మాట్లాడారు.
పాలమూరు దాహార్తి తీర్చడం చంద్రబాబుకు ఇష్టం లేదని అభిప్రాయపడ్డారు. అందుకే ప్రాజెక్టులు ఆపేందుకు ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తున్నారని ఆరోపించారు. 40 టిఎంసీల నీటితో గొంతెండిన తెలంగాణ, పాలమూరు దాహార్తి తీరుస్తామని చెప్పారు.
తెలంగాణలోని మూడున్నర కోట్ల మంది దాహార్తిని తీర్చేందుకు సీఎం కేసీఆర్ వాటర్గ్రిడ్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారన్నారు. రాబోయే మూడేళ్లలో ఏ ఆడబిడ్డయినా మంచినీటి కోసం రోడ్డెక్కితే ఎన్నికల్లో ఓట్లు అడగనని చెప్పిన సీఎం కేసీఆర్ ఒక్కరేనన్నారు.
దీన్ని అదునుగా భావించిన చంద్రబాబు వాటర్ గ్రిడ్ పథకాన్ని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో సీఎం ప్రవేశపెడుతున్న పథకాలను చూసి చంద్రబాబుకు కడుపు మంట వస్తోందన్నారు.
పాలమూరు ఎత్తిపోతలను అడ్డుకునేందుకు బాబు దొంగ నాటకాలడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణను నాశనం చేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. గోదావరి, కృష్ణా నుంచి తెలంగాణకు 1200 టీఎంసీల నీరు రావాలని, తెలంగాణకు చట్టపరంగా రావాల్సిన నీటిని కూడా రానివ్వకుండా బాబు అడ్డుకుంటున్నారన్నారు.
తెలంగాణకు గోదావరి నుంచి 900 టీఎంసీలు, కృష్ణా నుంచి 300 టీఎంసీలు అధికారికంగా కేటాయించారని, ఇందులో 120 టీఎంసీలు తాగునీటికి వాడుకునే హక్కు తెలంగాణకు ఉందన్నారు. కానీ 120 టీఎంసీలలో 40 టీఎంసీలు మాత్రమే తాగునీటికి వాడుకుంటున్నామన్నారు.
ఈ 40 టీఎంసీల నీటిని కూడా అడ్డుకునే ప్రయత్నం బాబు చేస్తున్నారన్నారు. అందరి కుట్రలను తిప్పికొడుతూ తెలంగాణను దేశంలోనే అత్యంత ఉత్తమ రాష్ట్రంగా తీర్చిదిద్దుతామన్నారు. పాలమూరుకు ఇంటింటికి నీరు ఇచ్చే బాధ్యతను తీసుకుంటామన్నారు. అర్ధరాత్రి దొంగల్లా రైతులకు విద్యుత్ ఇవ్వమని చెప్పారు. మూడేళ్ల తర్వాత నీటి కోసం ఏ ఆడబిడ్డ రోడ్డెక్కినా ఓట్లు అడగమని చెప్పారు.
కాంగ్రెస్ పైన కెటిఆర్ చెప్పిన పిట్టకథ
విపక్షాల పైన మండిపడుతూ.. మంత్రి కెటిఆర్ ఓ పిట్టకథ చెప్పారు. 'ఓ పిల్లాడు చిల్లర దొంగతనాలు చేస్తుంటాడు. చిన్నప్పటి నుంచి అది అలవాటైంది. పదేళ్లకే జేబులు కొట్టే చెడ్డ పద్ధతి అలవర్చుకున్నాడు. పదహారు, పదిహేడేళ్లు వచ్చే సరికి తాగుడుతో సహా అన్ని వ్యసనాలు అలవాటయ్యాయి.
ఆ తర్వాత ఓసారి తండ్రి జేబులో నుంచి అతను డబ్బులు దొంగిలించేందుకు ప్రయత్నించాడు. అది చూసిన అతని అమ్మ ఆపింది. కోపం వచ్చిన ఆ వ్యవసనపరుడైన కొడుకు తల్లిని రోకలితో కొట్టాడు. అడ్డుగా వచ్చిన తండ్రిని కొట్టాడు. వారిద్దరు చనిపోయారు. పోలీసులు అతనిని అరెస్టు చేశారు. న్యాయస్థానానికి తరలించారు.
వ్యసనపరుడైన కొడుకును ఉద్దేశించి జడ్జి... నేను ఇప్పటి వరకు ఎన్నో కేసులు చూశాను, కానీ తల్లిదండ్రులను చంపిన పాపాత్ములను చూల్లేదు, అసలు నీకేం శిక్ష వేయాలి చెప్పు అని అడిగాడు.
దానికి ఆ వ్యసనపరుడైన కొడుకు స్పందిస్తూ... అయ్యా, నేను తల్లిదండ్రులు లేని అనాథను. సార్ నన్ను వదిలి పెట్టండి అని అన్నాడు.' ఇది కెటిఆర్ చెప్పిన పిట్ట కథ. కాంగ్రెస్ నేతలు అధికారంలో ఉండి ఏం చేయలేక, ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.