జగన్ను దెబ్బ తీస్తున్న చంద్రబాబు: రోజాకు పెరుగుతున్న సానుభూతి
హైదరాబాద్: తన రాజకీయానుభవంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వ్యూహాలను శాసనసభా సమావేశాల్లో సమర్తంగా దెబ్బ తీస్తున్నారు. వైయస్ జగన్ అనుభవరాహిత్యంకూడా అందుకు తోడవుతోంది. జగన్ వ్యూహాలకు ప్రతివ్యూహాలు పన్నుతూ చంద్రబాబు జగన్ను ధీటుగా ఎదుర్కుంటున్నారు.
దాంతో జగన్ ప్రతి నిర్ణయం బెడిసికొడుతోంది. ఈ సమావేశాల్లో అధికార పార్టీపై విరుచుకుపడదామని అనుకున్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంచనా మేరకు ఫలితాలు సాధించడం లేదు. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి చంద్రబాబు తీరును ఎండగట్టడమే కాకుండా తమ పార్టీ నుంచి టిడిపిలోకి ఫిరాయించిన ఎమ్మల్యేలపై అనర్హత వేటు పడేలా చేయాలని జగన్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.
అదే వ్యూహంతో స్పీకర్ కోడెల శివప్రసాద్పై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం వ్యూహాన్ని కూడా చంద్రబాబు దెబ్బ తీశారు. జగన్ అస్త్రాలు సంధించే లోగానే మూజువాణి ఓటుతో అవిశ్వాస తీర్మానం వీగిపోయేలా అధికారపక్షం వ్యూహాన్ని అమలుచేసింది.
ఆ మరునాడే స్పీకర్ కోడెలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. అది కూడా ఫలితం ఇవ్వలేదు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఏ విధంగానైనా ఇరకాటంలో పెట్టాలని జగన్ ప్రయోగించిన అస్త్రాలన్నీ మొక్కబోతున్న సమయంలో రోజా వ్యవహారం తెర మీదకు వచ్చింది.
శాసనసభ నుంచి సంవత్సరంపాటు తనను సస్పెండ్ చేయడాన్ని రోజా సుప్రీంకోర్టులో సవాలు చేయడం, ఆ కేసు హైకోర్టుకు రావడం, రోజా సస్పెన్షన్పై శాసనభ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుపట్టడం చకచకా జరిగిపోయాయి. సభాపతి నిర్ణయాన్ని తప్పుపట్టింది కనుక రోజాను శాసనసభ సమావేశాల్లో పాల్గొనేందుకు అనుమతించాలని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వాదిస్తోంది.
డిసెంబర్ 18న శాసనసభ నుంచి సంవత్సరంపాటు రోజాను సస్పెండ్ చేసినప్పుడు రాష్టవ్య్రాప్తంగా ఆమెకు సానుభూతి వచ్చింది. ఆ మరునాడు సభలో జరిగిన సంఘటనల సన్నివేశాలకు సంబంధించిన వీడియో టేపులు విడుదలయ్యాయి. వీటి ఆధారంగా వైసిపి అధికారపక్షం ఎదురు దాడికి దిగింది. దీనిపై ఇరుపార్టీల మధ్య కొద్ది రోజులపాటు దుమారం రేగింది. ఈ వివాదం సద్దుమణిగిపోయిందని అనుకుంటున్న సమయంలో హైకోర్టు తీర్పుతో మళ్లీ రాజుకుంది.
రోజా సస్పెన్షన్ వ్యవహారాన్ని పూర్తిగా తమకు అనుకూలంగా మార్చుకోవాలని జగన్ ప్రయత్నిస్తున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీతో వచ్చినా రోజా శుక్రవారం శాసనసభకు వస్తారని, పోలీసు బలగాలు ఆమెను అడ్డుకుంటాయని జగన్కు తెలియంది కాదు. ఈ ఘటనను వైకాపా పక్షానికి చెందిన ఎమ్మెల్యేలో, లేదా జగనో నేరుగా సభలోకి వెళ్లి తమ వాదనను వినిపించాల్సింది.
హైకోర్టు తీర్పును అమలు చేస్తారా? లేదా? లేదంటే కారణాలు చెప్పాలని విపక్షం డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఇరకాటంలో పడేది. రోజాపట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సభలో ప్రస్తావించినప్పుడు, అధికారపక్షం విధిగా ఎదురుదాడికి దిగుతుంది. అటువంటప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి కొంత మైలేజ్ వచ్చేది. కానీ జగన్, ఎమ్మెల్యేల్లో కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా సభకు వచ్చి మాట్లాడకపోవడాన్ని వైసిపి వ్యూహాత్మక తప్పిదంగానే అంతా భావిస్తున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు సభలో లేకపోవడంతో రోజా వ్యవహారాన్ని సోమవారంనాడు చర్చిద్దామని స్పీకర్ చెప్పేసి దానికి ముగింపు పలికారు. తొలి రోజు చేసిన తప్పిదాన్ని గుర్తించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సభ్యులు రెండో రోజు శనివారం సభకు హాజరయ్యారు. శనివారం రోజా ఆందోళన చేశారు. ఈ స్థితిలో రోజా పట్ల సానుభూతి పెరుగుతోంది.